05-06-2025 05:36:25 PM
బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్..
మునగాల: నేషనల్ 65 హైవే రహదారిపై ఉన్న గ్రామాలలో అండర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని బీసీ విద్యార్థి సంఘం(BC Students Union) జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అండర్ పాస్ బ్రిడ్జిలు లేకపోవడం వలన ఎంతోమంది అభాగ్యుల జీవితాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కట్ట కొమ్ముగూడెం నల్ల బండ గూడెం క్రాస్ రోడ్డు ఆకుపాముల ముకుందాపురం మునగాల తాడువాయి మాధవరం తదితర గ్రామాలలో అండర్పాస్ బ్రిడ్జి లేకపోవడం వలన ఎంతోమంది జీవితాలు బలైపోయాయని జిఎంఆర్ కంపెనీ టోల్ ఫీజులు వసూలు చేసినంత శ్రద్ధ రహదారిపై ప్రమాదాలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారితో సంబంధం లేకుండా సర్వీస్ రోడ్ల నిర్మించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని అన్నారు. జిఎంఆర్ సంస్థ స్పందించకపోతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.