భారత్లో మళ్లీ లాక్డౌన్?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: భారత్లో లాక్డౌన్(lockdown) విధిస్తారన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని, ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Union Minister Hardeep Singh Puri) శుక్రవారం స్పష్టం చేశారు. ప్రపంచ పరిస్థితి అస్థిరంగా ఉన్నందున, ఇంధనం, సరఫరా గొలుసులు, నిత్యావసర వస్తువుల రంగాలలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోందని పూరి ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
పౌరులకు ఇంధనం, విద్యుత్, ఇతర కీలక సరఫరాలు నిరంతరాయంగా అందేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో దేశం నిరంతరం స్థైర్యాన్ని ప్రదర్శించిందని, ఇకపైనా సకాలంలో, చురుకుగా, సమన్వయంతో వ్యవహరిస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండాలని హర్దీప్ సింగ్ పురీ కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయని హెచ్చరించారు.




