యూపీ యువతి డిజిటల్ అరెస్ట్
రూ.99వేలు కాజేసిన కేటుగాళ్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఆగ్రాకు చెందిన మోడల్ శివాంకిత దీక్షిత్ను తాజాగా డిజిటల్ అరెస్ట్ చేసి రూ.99వేలు కాజేశారు. కేటుగాళ్లు మొదటగా ఆమెకు సాధారణ కాల్ చేసి తమను తాము సీబీఐ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు.
అనంతరం వాట్సప్లో వీడియో కాల్ చేయాలని సూచించారు. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసుల్లో తన పేరు ఉందని దీక్షిత్ను బెదిరించారు. చిన్న పిల్లల కిడ్నాప్, దొంగతనాలకు సంబంధించిన డబ్బును తన అకౌంట్లో ఉన్నట్టు తమ విచారణలో బయటపడిందని ఆమెను బెదిరించారు.
దాదాపు రెండు గంటలపాటు ఆమెను మానసికంగా వేధించి కేసు నుంచి బయటపడాలంటే తమకు 2.5లక్షల డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర భయాందోళనలకు గురైన దీక్షిత్ తన అకౌంట్ నుంచి రూ.99వేలను సైబర్ నేరగాళ్ల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు.






