10-02-2026 12:40:19 AM
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, ఫిబ్రవరి 9 ( విజయక్రాంతి ) :రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ నెల 09 నుండి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తో కలిసి వారోత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరపు ప్రధాన అంశం కేవైసీ (KYC) సురక్షిత బ్యాంకింగ్కు తొలి అడుగు అనే విషయంపై కేంద్రీకృతమై ఉందని అన్నారు.
ప్రజలలో సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ వివరాలను నవీకరించుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, సైబర్ భద్రతపై జాగ్రత్తలు పాటించడం మరియు ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు.ప్రతి పౌరుడు తన బ్యాంకు ఖాతాలకు సం బంధించిన కేవైసీ వివరాలను వెంటనే నవీకరించుకోవాలని జిల్లా కలెక్టర్ గారు కోరారు.
ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, కేవైసీ వివరాలను నవీకరించుకొని, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులను అనుసరించాలని కోరారు. ఆర్థిక అవగాహన ప్రతి కుటుంబం మరియు సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్, సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు రమేష్, వెంకటేష్, నాగేంద్ర ప్రసాద్, వనజ, యమున, విజయ్, తదితరులు పాల్గొన్నారు.