16-07-2025 06:51:46 PM
ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): వచ్చే దసరా నాటికి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారాపల్లి వరకు 8 కిలోమీటర్లు ఫ్లైఓవర్ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... యాదగిరిగుట్ట, వరంగల్ హైవే పై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు.
తమ ప్రభుత్వం రాగానే ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ ఘట్కారితో సైతం చర్చించి పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పాత కాంట్రాక్టర్ ను సైతం మార్చి కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించామని, ప్రత్యేక శ్రద్ధతో పనులలో వేగాన్ని పెంచి త్వరిత గతిన పనులు పూర్తి చేయిస్తా మన్నారు. నగరంలో పివి ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లై ఓవర్ ఉప్పల్ ఫ్లై ఓవర్ అని, వచ్చే దసరా నాటికి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.