30-12-2025 11:47:13 AM
యూరియా కొరత లేదు
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ (విజయశాంతి): ఎరువుల యాప్ సర్వర్ డౌన్ కారణంగా యూరియా పంపిణీకి ఇబ్బందులు కలుగుతుండడంతో, రైతులకు రైతు పోర్టల్ డేటాబేస్ ఆధారంగా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం ప్రైవేటు డీలర్లు, సహకార సంఘాల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు.
మంగళవారం ఉదయం కలెక్టర్ స్వయంగా జిల్లాలోని బయ్యారం, కొత్తపేట సహకార సంఘాల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. యూరియాకు జిల్లాలో ఎలాంటి కొరతలేదని, యాప్ ద్వారా పంపిణీకి సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల తాత్కాలికంగా పాత పద్ధతిలో రైతులకు యూరియా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యాసంగి సీజన్లో పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందజేస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట ఏడిఏ అజ్మీర శ్రీనివాస్, తహసిల్దార్ తదితరులు ఉన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మండలాల్లో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు పర్యవేక్షించే విధంగా ఆదేశాలు జారీ చేశారు.