30-12-2025 11:45:52 AM
మరో యువకునికి తీవ్ర గాయాలు.. స్థానిక ఆసుపత్రికి తరలింపు
అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
అబ్దుల్లాపూర్ మెట్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దిల్ సుఖ నగర్ చెందిన హంస లేక (22) బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సీఈసీ చదువుతుంది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బాటసింగారంలోని అన్నమాచార్య కాలేజీలో హంస లేక కు సెంటర్ పడడంతో ఉదయం దిల్ సుఖ నగర్ నుంచి హంస లేక మరో యువకుడు ద్విచక్ర వాహనంపై బాటసింగారంలోని అన్నమాచార్య కాలేజీకి బయలుదేరాగా మార్గ మధ్యలో మౌంట్ ఒపేరా వద్ద వాహనాన్ని మరో యాక్టివా ఢీకొట్టడంతో బండి పైన ఉన్న యువతి లారీ చక్రాల కింద పడి హంసలేక అక్కడికక్కడే మృతి చెందింది.
యువకుడు ఎగిరి ఫుట్ పాత్ పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా హంస లేక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ వి. అశోక్ రెడ్డి తెలిపారు.