11-09-2025 10:29:17 AM
ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేసిన మండల వాసులు
దండేపల్లి,(విజయక్రాంతి): ప్రతి రోజు యూరియా కోసం రైతులు(farmers) సొసైటీల వద్ద వందల సంఖ్యలో రైతులు నిలబడి ఉన్న, పాసుబుక్కులు, ఆథార్ కార్డులు, చెప్పులను వరుసలో ఉన్న దృశ్యాలే దర్శనమిస్తుంటాయి. కానీ దండేపల్లి మండలంలో రైతులు యూరియా కోసం వచ్చి ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో మండల వ్యవసాయాధికారి గొర్ల అంజిత్ కుమార్ వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. దండేపల్లి, నెల్కి వెంకటాపూర్ పీఏసీఎస్ ల వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు ఇబ్బంది కలుగకుండా టెంట్ వేయించి, రైతులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు ఏర్పాటు చేశారు.
కూర్చున్న రైతులకు నాను యూరియా వాడకం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. అలాగే వర్షాల కారణంగా పంటలకు జరిగే నష్టం, నివారణ చర్యల గురించి అవగాహన కల్పించారు. మరోవైపు యూరియా కోసం వచ్చిన రైతులందరు కుర్చీలలో కూర్చొని ఈ పాస్ మిషన్ లో ఆథార్ ఎంట్రీ చేయించుకొని యూరియా ఇంటికి తీసుకువెళ్లేలా వసతులు కల్పించడంతో రైతులు సదరు మండల వ్యవసాయాధికారిని మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ వారం రోజుల్లో మండలానికి కావాల్సిన ఎరువులు రానున్నాయని, జిల్లాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు వేదికల వద్దకు, సొసైటీ కార్యాలయాల వద్దకు సమావేశాలకు వచ్చినట్లు వచ్చి ఎరువులు తీసుకువెళ్లాలని కోరారు.