30-12-2025 07:14:18 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము మట్టపల్లి మహక్షేత్రములో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 5 గంటలకు వేదమంత్రాలతో శ్రీ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనము అత్యంత వైభవముగా నిర్వహించబడింది. తదుపరి శ్రీ స్వామి వారికి విశేష అర్చనలు లక్ష ఆరేపత్రి పూజ కొత్త వెంకటనరసింహారావు ముత్యాలంపాడు వారిచే నిర్వహింపబడింది. మట్టపల్లి మాడ వీధుల్లో శ్రీ స్వామి వారి గరుడ సేవ ఊరేగింపు భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయి జయజయధ్వానాల మద్య ఉత్సవం కొనసాగింది.
ఈ ఉత్సవములలో హరికథలు, బుర్రకథలు, సంగీత కచేరీలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమములు అత్యంత వైభవముగా జరిగాయి. ఉత్సవములకు దేవస్థాన ప్రాంగణములో గల అన్ని అన్నదాన సత్రముల కమీటీల వారు చౌటపల్లి, బక్కమంతుల గూడెం గ్రామ ప్రజలు స్వచ్చందంగా అన్నదానము ఏర్పాటు చేశారు. భక్తలు ఈ ఉత్సవములో వేలాది సంఖ్యలో శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఇట్టి కార్యక్రమములో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు,విజయ్కుమార్, కార్యనిర్వహణాధికారి బి.జ్యోతి, గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు,ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.