30-12-2025 07:21:39 PM
- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నెన్నెల మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేందుకుపూనుకునసన్నారు.
అందులో భాగంగానే అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరు వేరుగా మూత్రశాలలు, వంటశాల, ప్రహరీ గోడ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్య బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి పనులలో భాగంగా చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీలో పరిశుభ్రత నిబంధనలు పాటించాలన్నారు.
తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, మెనూ ప్రకారం సకాలంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలలోని వంటశాల, తరగతిగదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మండలంలోని చిత్తాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను కూడా విజిట్ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్య బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.