సమస్యలు పరిష్కారానికి గ్రామసభలు
ఉట్నూర్, (విజయక్రాంతి): గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుటకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని డి ఆర్ డి ఓ పి డి రవీందర్ రాథోడ్ అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ పంచాయతీ కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించుటకు జిల్లా కలెక్టర్ రాజర్శి షా దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు.
ఉట్నూర్ డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూరు మండలాల పరిధిలోని ఎంపిక చేసిన గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామ సభలలో ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న వివరాలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పనులపై గ్రామ సభలో చర్చించడంతోపాటు పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ప్రజలు కోరారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ సరఫరా విషయంపై గ్రామ సభలో చర్చించారు. రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం పంపిణీ పై చర్చలు జరిపారు. ఆయా గ్రామపంచాయలు నిర్వహించిన గ్రామ సభలకు సర్పంచులు అధ్యక్షత వహించారు.






