ఘనాపూర్ లో రెవెన్యూ సదస్సులను అడ్డుకున్న గ్రామస్తులు..
తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం ఘనపూర్ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును గ్రామస్తులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం అధికారులు గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్న స్థలం వద్దకు గ్రామస్తులు చేరుకొని గందరగోళం సృష్టించారు. గతంలో 441 సర్వే నంబర్ లో పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది, కానీ గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ నిర్మాణాల పేరిట భూములను తీసుకొని సరైన స్థాయిలో నష్టపరిహారాన్ని ఇవ్వలేదని నిలదీశారు. తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని కోరినారు, గతంలో ఎమ్మార్వో కు, ఆర్ డి ఓ కు భూమిని కోల్పోయిన బాధితులు నష్టపరిహారం ఇవ్వాలంటూ వినతిపత్రం సమర్పించిన అధికారులు ఏ కోశాన పట్టించుకోలేదని వారన్నారు. మాకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతే రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని గ్రామస్తులు హెచ్చరించారు.






