18-06-2025 01:04:02 AM
- హైకోర్టు ఉత్తర్వులను అమలు పరచపోతే కోర్టు ధిక్కారణ
- దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ మధనేశ్వర్ రెడ్డి
- శిరుసనగండ్ల ఆలయ భూముల్లో ఇండ్ల నిర్మాణదారులతో సమావేశం
- ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా... బాధితుల అవేదన
చారకొండ, జూన్ 17: శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి భూముల్లో అక్రమంగా ఇండ్లను నిర్మించుకున్న ఆక్రమణ దారులు స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేయాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ మధనేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణంలో తహసీల్దార్ అద్దంకి సునిత అధ్యక్షతన ఆలయానికి సంబంధించిన భూమిలో అక్ర మంగా నిర్మించిన ఇళ్లను తొలగింపుపై నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈసందర్భంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ మధనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్ 327, 328లో అక్రమంగా 38 మంది వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని, వాటిని తొలగించాలని గతేడాది జనవరి 23న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా తొలగించనందుకు దిక్కారణ జరిగిందని, ఈనెల 19లోపు స్వచ్చందంగా అక్రమణాదారులు ఇళ్లను ఖాళీ చేయాలన్నారు. ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా ఇండ్లు ఖాళీ చేసి పొమ్మాంటే ఎట్లా బతకాలని, తమకు సమయం ఇవ్వాలని ఇళ్ల నిర్వాసితులు అధికారులను కోరారు.
తమ వద్ద అన్ని అధారాలు ఉన్నాయని, అక్రమంగా నిర్మించలేదని, ఏళ్ల తరబడి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని, కాయకష్టం చేసి ఇళ్లు నిర్మించుకున్నామని అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఈ విషయం కోర్టు ఫరిధిలో ఉందని, కోర్టులను ఆశ్రయించాలే తప్పా, తాము ఏమీ చేయలేమని ఖాళీ చేయాల్సిందేనని అధికారులు ఖరాఖండిగా తేల్చిచెప్పడంతో.. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో ఉన్నందున 19 తేదీలోపు ఖాళీ చేయమంటే కష్టమని ఇళ్లు ఖాళీ చేసి వెళ్లెందుకు కనీసం 25 రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరుతూ నిర్వాసితులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సు శంషుద్దీన్, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఎంపీవో వెంకటేశ్, దేవాదాయ అధికారులు వీణాధరీ, ఆంజనేయులు, ప్రసాద్, కవిత, మాజీ సర్పంచి యాతం శ్రీను, నిర్వాసితులు పాల్గొన్నారు.