18-06-2025 01:02:07 AM
పెంట్లవెల్లి, జూన్ 17 : నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు త్రాగునీటి కోసం ప్రమాదకర స్థాయిలో తలకిందులుగా వేలాడుతూ ఇబ్బందులు పడ్డారు. మంగళవారం పాఠశాలకు హాజరైన 60కి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం తాగేందుకు నీరు అందక, కాంపౌండ్ లోని సంపులోకి తలకిందులుగా సర్కస్ మాదిరి వేలాడుతూ నీటిని తోడుకుని తాగారు.
పాఠశాలలో తాగునీటిని ఏర్పాటు చేయకపోవడంతో పాటు విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో నీటిని తోడుతున్న పాఠశాల ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం దారణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో విద్యార్థులు అటుతప్పితే నీటిలో మునిగి ప్రాణాల పోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు విద్య పట్ల, విద్యార్థుల శ్రద్ధ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండి పడుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కురుమయ్య వివరణ ఇస్తూ పాఠశాలలో తాగునీటి కొరత లేదని విద్యార్థులు భోజనం అనంతరం ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు మాత్రం సంపు వైపు వెళ్లిన విషయం మేము గమనించలేదు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.