18-06-2025 01:04:44 AM
ఆందోళన వ్యక్తం చేస్తున్న పేద రోగులు
డుమ్మా కొట్టినా పట్టించుకోని వైద్యాధికారి
నాగర్ కర్నూల్, జూన్ 17 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత రోగులకు వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెలిశాయి. ఉదయం రాత్రి వేళల్లోనూ పేద రోగులకు అందుబాటులో ఉండి వైద్యం అందించాల్సి ఉంది. కానీ అందులో పని చేసే వైద్య సిబ్బంది ప్రైవేటు వ్యాపకాలతో ఇంటికే పరిమితం అవుతూ వారి స్థానంలో పతులను (భర్తలను) విధుల్లోకి పంపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఫలితంగా పేద రోగులు సరైన వైద్యానికి నోచుకోక ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్ఎంపీలను ఆశ్రయించి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇదే వ్యవహారం నిత్య కృత్యంగా మారుతొందని విమర్శలు ఉన్నాయి. గత కొంత కాలం క్రితం పని దినాల్లోనూ సిబ్బంది, వైద్యాధికారి విధులకు డుమ్మా కొట్టి ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉంచడం అప్పట్లో పెను దుమారం రేగింది.
సదరు వైద్యాధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు మందలించడంతో కొంతకా లం డ్యూటీలు నామమాత్రంగా చేస్తూ వచ్చారు. ప్రస్తుతం డ్యూటీలో ఉండే స్టాప్ నర్సులు ఇంటికే పరిమితం అవుతూ వారి స్థానంలో వారి భర్తలను డ్యూటీకి పంపడం రోగులకు వైద్యం కూడా చేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. తెలిసి తెలియని వైద్యం వల్ల పేద రోగులు మరింత రోగాల బారిన పడుతున్నారని మండల వాసులు మండిపడుతున్నారు.
రాష్ర్ట ఎక్సుజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఏసీ గదులకే పరిమితం కావడంతో కింది స్థాయిలో అధికారులు నామమాత్రంగా తనిఖీలు జరిపి మామ అనిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరి కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులను, ఆర్ఎంపీలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే పల్లె దావఖానాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామాలలో పారిశుధ్యం లోపిస్తూ సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.
కాగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించాల్సిన సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. కోడేరు మండలానికి చెందిన ఓ స్టాఫ్ నర్సు తన ఇంటి వద్ద గద్దె చెబుతూ మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తోందని విమర్శలు ఉన్నాయి.
పెద్ద కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తించాల్సిన సదురు స్టాఫ్ నర్స్ రాత్రి వేళల్లో తరచూ డుమ్మా కొడుతూ తన స్థానంలో తన పతిని విధులకు పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే తంతు తరచూ జరుగుతూ ఉన్నప్పటికీ మండల వైద్యాధికారి, జిల్లా స్థాయి అధికారుల వరకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మా దృష్టికి వచ్చిన వెంటనే మందలించాం.!
స్టాఫ్ నర్స్ బదులు తన భర్త విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆలస్యంగా తమ దృష్టికి వచ్చిందని వెంటనే సదరు స్టాఫ్ నర్స్ ను మందలించాం. దీనిపై మేము జారీ చేసి సంతోషి కోరుతాం. ఉన్నతాధికారుల ఆదేశాల అనుసారం శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ నారాయణస్వామి, వైద్యాధికారి, పెద్ద కొత్తపల్లి మండలం