27-05-2025 12:44:29 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, మే 26 (విజయ క్రాంతి ): నిజామాబాద్ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా, అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు.
స్వయం సహాయక సంఘాలలోని ప్రతి సభ్యురాలి విద్యార్హతలు గుర్తిస్తూ, నిరక్షరాస్యులుగా ఉన్న వారికి చదవడం, రాయడం నేర్పించాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్రంలోనే తొలిసారిగా సెర్ప్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సమగ్ర శిక్ష, వయోజన విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇందూరు అక్షరలక్ష్మి’ పేరుతో రూపొందించిన యాప్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఐడీఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఆవిష్కరించారు.
సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా యాప్ ను రూపొందించడం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులను అభినందించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, ఏ.పీ.డీ రవీందర్, డీఈఓ అశోక్, డీడబ్ల్యూఓ రసూల్ బీ, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వయోజన విద్యా సంయుక్త సంచాలకులు గోవింద్ రావు, స్వయం సహాయక మహిళా సమాఖ్య ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.