మన భద్రతకు మనమే బాధ్యత తీసుకోవాలి
జిల్లా ఎస్పీ డి.జానకి
మహబూబ్ నగర్ టౌన్ , ఏప్రిల్ 1 : ప్రయాణం చేసి సమయంలో మన భద్రత కోసం మనమే బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. జాతీయ రహదారి44పై రాజాపూర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో రోడ్డు డైవర్షన్లపై ఎస్పి డి జానకి భద్రతా సూచనలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారిపై వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో డైవర్షన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
డైవర్షన్ ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, సిగ్నల్ లైట్లు, బ్యారికేడ్లు మరియు ఇతర సూచికలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా డైవర్షన్ మార్గాలను సురక్షితంగా, సౌకర్యవంతంగా రూపొందించాలని, అలాగే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థకు ఎస్పీ ఆదేశించారు.
ప్రయాణం లోను కూడా ప్రతి ఒక్కరు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాంట్రాక్టర్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.




