చిరంజీవి ప్రోత్సాహంతో ప్రారంభించాం
ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ క్రమంలోనే నిర్మాత బసవరాజు లహరిధర్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “మా నాన్న బసవరాజు శ్రీనివాస్ పీఆర్పీలో కీలకంగా ఉండేవారు. అప్పటి నుంచి చిరంజీవి గారితో నాన్నకు పరిచయం ఉంది. ‘డ్రింకర్ సాయి’ సినిమా సన్నాహాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారికి కథ గురించి చెప్పాం. ఆయన ఓకే ప్రొసీడ్ అన్నారు. అలా చిరంజీవి గారి ప్రోత్సాహంతో ‘డ్రింకర్ సాయి’ సినిమా ప్రారంభించాం.
ఈ సినిమా పనులు 2019లోనే మొదలు పెట్టాం కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ నిలిచిపో యింది. ఆ తరువాత కథలో కొన్ని మార్పులు చేసి తిరిగి రూపొందించాం. కథకు ధర్మ బాగుంటాడనిపించింది. ఐశ్వర్యను ఆడిషన్ చూసి తీసుకు న్నాం. సినిమా ఫస్టాఫ్ లోనే యూత్ ఫుల్ ఎలిమెంట్స్ .. సెకండాఫ్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇంప్రెస్ అయ్యేలా స్టోరీ ఉంటుంది. కంటెంట్ మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి తప్పక సక్సెస్ అందుకుంటామనే ఆశిస్తున్నాం” అని బసవరాజు లహరిధర్ తెలిపారు.






