06-02-2026 08:31:40 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి సుమారు రూ.26 కోట్ల మేర అక్రమంగా వసూలు జరిగిందని ఆరోపిస్తూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ తిరుపతిజిల్లా కార్యదర్శి అక్బర్ ను జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ ను అపహరించిన ఘటనను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా శుక్రవారం బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి మండలం అంబేద్కర్ విగ్రహం సమీపంలో మేడిపల్లి మండల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెడ్చల్ జిల్లా అధ్యక్షులు అవినాష్ ప్రధాన కార్యదర్శి కార్తిక్ మాట్లాడుతూ, మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా రూ.26 కోట్ల వరకు వసూలు చేశారని తెలిపారు. ఈ దోపిడీపై ఫిర్యాదు చేసి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలియజేయడానికి ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కమిటీ వెళ్తున్న సమయంలోనే ఈ అపహరణ చోటుచేసుకుందని అన్నారు. విద్యార్థి నాయకులపై జరిగిన ఈ దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,ప్రైవేట్ యూనివర్సిటీల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థులపై దోపిడీ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియంత్రణలు అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బి సాయి చరణ్ మండల అధ్యక్షులు సతీష్, కార్యదర్శి కౌశిక్, కమిటీ సభ్యులు మనీష్, ప్రశాంత్, అరుణ్, భరత్ ,హేమంత్, విష్ణు, గోవర్ధన్, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.