07-11-2025 12:48:12 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, నవంబర్ 6(విజయక్రాంతి): అవినీతిని అంతమొందించడానికి ఉక్కుపాదం మోపుతామని, జిల్లాలో పారదర్శక పాలనే లక్ష్యంగా ముందుకు పోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా అధికారులు, సిబ్బందికి అవినీతి ఆలోచన ఉంటే విరమింప చేసుకోవాలని సూచించారు.
ప్రజల పట్ల ఉద్యోగులు జాలి, కరుణ కలిగి ఉండి వృత్తిపట్ల నిబద్ధతగా ఉండాలన్నారు. పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల భరతం పడతామన్నారు. ఉద్యోగులందరూ నీతి, నియమాలు అలవర్చుకోవాలని సూచించారు. ఆయా శాఖలలో పేరుకు పోతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ప్రభుత్వ ఉద్యోగులేనని తెలిపారు. అధికారులందరూ ఏకధాటిగా అవినీతిపై ఉక్కు పాదం మోపాలన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం అవినీతిపై ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఏ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగారావు, మెదక్ ఆర్డిఓ రమాదేవి ,అధికారులు పాల్గొన్నారు.