03-08-2025 04:15:02 PM
రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మిస్తామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్ లో ఆదివారం అధికారులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్ రెడ్డి రామ్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి మంత్రి క్షేత్ర స్థాయి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎల్బీనగర్ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసన్నారు. ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ది కోసం కృషి చేశానని గుర్తు చేశారు.
ఇప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నాను.. ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుమారు రూ, 650 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై చర్చించడానికి ఈ నెల 6వ తేదీన కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తానన్నారు.
హైదరాబాద్ ను అభివృద్ది చేశానంటున్న కేటీఆర్.. ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు ప్రజలను ఏమార్చిందని, అభివృద్ది చేయలేదని విమర్శించారు. బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేసిందని ఆరోపించారు. ప్రజలే దేవుళ్ళుగా మారి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు కేసీఆర్ బిడ్డకు ఏం పని..10 ఏండ్లు బీసీల కోసం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎవరెంతో వారికంతా ఇవ్వాలనేది మా ఇందిరమ్మ ప్రభుత్వ విధానమన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు.