calender_icon.png 4 June, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే బంకర్లు నిర్మిస్తాం

31-05-2025 12:00:00 AM

- పాకిస్థానీయులు పిరికిపందలు

- అమాయకులను బలితీసుకున్నారు

- అమర్‌నాథ్ యాత్రపై భద్రతా సమీక్ష నిర్వహించిన అమిత్ షా

- ఆపరేషన్ సిందూర్ సమయంలో 118 పాకిస్థానీ పోస్టుల ధ్వంసం

- దేశ సరిహద్దుల్లో దాడులు జరిగితే ముందుండేది బీఎస్‌ఎఫ్ జవాన్లే

- పూంచ్‌లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

శ్రీనగర్, మే 30: సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారి భద్రతకు త్వరలోనే బంకర్లు నిర్మిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హామీనిచ్చారు. సైనిక దాడులతో భారత్‌కు చెందిన అనేకమంది అమాయకులను బలితీసుకున్న పాకిస్థానీయులు పిరికిపందలు అని ధ్వజమెత్తారు.

ఆపరేషన్ సిందూర్ దాడుల అనంతరం తొలిసారిగా షా శుక్రవారం పూం చ్ జిల్లాలో పర్యటించారు. రెండు రోజుల పర్యటన కోసం అక్కడికి వెళ్లిన మంత్రి పాకిస్థాన్ దాడుల సందర్భంగా గాయపడ్డ, ఆప్తు లు, ఆస్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి నష్టపరిహారం అందజేశారు. 

అనంతరం పూంచ్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ.. ‘అమాయకులను పొట్టనపెట్టుకున్న పాకిస్థానీయులు పిరికిపందలు. జమ్మూకశ్మీర్‌లోని ప్రార్థనా మం దిరాలు, నివాసస్థలాల మీద పాక్ దాడులు చేసింది. భారత్ పాకిస్థాన్ మీద చేసిన క్షిపణి దాడులను అమిత్ షా ప్రశంసించారు. ఆర్మీ కచ్చితత్వంతో మెరుపుదాడులు చేసిందన్నారు.

సరిహద్దుల్లో ఉన్న ప్రజల భద్రత కోసం భవిష్యత్‌లో మరిన్ని బంకర్లు నిర్మిస్తాం’ అని అమిత్ షా హామీనిచ్చారు. గురువారం సాయంత్రం పూంచ్ చేరుకున్న షా రాత్రికి భద్రతాధికారులతో అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. అమర్‌నాథ్ యాత్రికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో షా పేర్కొన్నారు. 

పాక్ నిఘా వ్యవస్థలన్నీ నాశనం

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సమావేశంలో మాట్లాడిన షా బీఎస్‌ఎఫ్ జవాన్లను కొనియాడారు. ‘140 కోట్ల మంది భారతీయులు బీఎస్‌ఎఫ్ జవాన్లను కొనియాడుతున్నారు. భారత సరిహద్దులో ఏ దాడి జరిగినా కానీ ఎదుర్కొనేందుకు బీఎస్‌ఎఫ్ సిద్ధంగా ఉంటుంది.

ఆపరేషన్ సిందూర్ దాడుల సందర్బంగా పాకిస్థాన్‌కు చెందిన 118 పోస్టులను బీఎస్‌ఎఫ్ ధ్వంసం చేసింది. పాకిస్థాన్ టెర్రరిస్టులు మన సరిహద్దుల్లో దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తుంటే బీఎస్‌ఎఫ్ ధీటుగా బదులిచ్చింది. బీఎస్‌ఎఫ్ శత్రువు నిఘా వ్యవస్థలను మొత్తం తునాతునకలుగా నాశనం చేసింది.’ అని పేర్కొన్నారు.

బీఎస్‌ఎఫ్ దాడులతో పాక్ సమాచార వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పట్లో  వారు సమాచార ఆధారిత యుద్ధా లు చేసే పరిస్థితుల్లో లేరని బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ తనకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, యూనియన్ హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్ తపన్ దేకా, బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.