21-06-2025 05:50:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరింత వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) తెలిపారు. శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ రెండో దశ ఇండ్లకు సంబంధించిన మార్కింగ్, గ్రౌండింగ్ పనులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరైన స్థలాల్లో నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలనీ, పనులపై అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) లబ్ధిదారుల ఓటిపి వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఇందుకోసం వార్డు స్థాయి అధికారులకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పట్టణాల్లో నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులందరూ నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.