25-05-2025 12:24:04 AM
- సొంత ఎజెండాతో ఉద్యమ కార్యాచరణా?
-పార్టీలో సర్దుకుపోతారా?
-గులాబీ శ్రేణుల్లో అంతర్గత చర్చ
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగ అంశాలే కేంద్రంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
డాడీ అంటూ కేసీఆర్ను ఉద్దేశించి పాజిటివ్, నెగిటివ్ అంశాలు అంటూ కవిత రాసిన లేఖపై పార్టీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో మొదట కొంత అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ, ఈనెల 16న తన కుమారుడు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కవిత ఈనెల 23న హైదరాబాద్కు వచ్చారు.
అయితే అమెరికా నుంచి కవిత వచ్చే రోజుకు ముందు రోజే ఈ లేఖ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో అమెరికా నుంచి కవిత వచ్చి ఏం మాట్లాడుతారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. శుక్రవారం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాత్రి 9 దాటిన తర్వాత చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడుతూ ఆ లేఖపై ఉన్న సస్పెన్స్కు తెరదించారు.
తానే లేఖ రాశానని స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడులాంటి వారని, కానీ, ఆ దేవుడి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవర్టులున్నారని, వారిని పక్కన పెడితేనే పార్టీ మరింత ముందుకు పోతుందన్నారు. ఎప్పుడో రాసిన లేఖను కావాలనే లీక్ చేశారంటూ ఆమె ఆరోపించారు.
అయితే శనివారం మీడియా సమావేశం నిర్వహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించారు. అట్లాంటి లేఖలు, సూచనలు అధ్యక్షుడికి పార్టీ కార్యకర్తలు ఇవ్వడం సాధారణంగా జరిగే కార్యక్రమని, గతంలో లోక్సభ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత రెండు వారాలకు పైగా రివ్యూ కార్యక్రమాలను నిర్వహించామ న్నారు.
ఈ రివ్యూ మీటింగ్లలో వేలాది మంది కార్యకర్తలు అనేక సూచనలు ఇచ్చారని, అయినా పార్టీ అంతర్గత అంశాలను బహిరంగపర్చడం సరికాదన్నా రు. కోవర్టులున్నారన్న కామెంట్లపై స్పం దిస్తూ అన్ని పార్టీల్లో రేవంత్రెడ్డి కోవర్టులున్నారని, తమ పార్టీలోనూ కోవర్టులున్నారన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తగిన సమయం వస్తే ఆ కోవర్టులు బయటపడతారన్నారు. దీంతో గులాబీ పార్టీలో కవిత ప్రస్థానంపై చర్చలు జోరందుకున్నాయి. ఆమె అడుగులు ఎటువైపు అని సర్వత్రా చర్చ జరుగుతోంది. కవిత పార్టీలో ము నుపటి లాగానే యాక్టివ్గా ఉంటారా? లేక తనకంటూ సొంత ఎజెండాతో ముందుకెళ్తారా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి.
కనపడని బీఆర్ఎస్ జెండాలు..
కవిత ఎయిర్పోర్టుకు చేరుకునే సమయంలో అక్కడా బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కానీ, పార్టీ జెండాలు కానీ కనిపించలేదు. సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న కవితకు స్వాగతం అంటూ బ్యానర్లు, ఫ్లకార్డులు దర్శనమిచ్చాయి. దీనితో కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరం జరుగనున్నారా అనే అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
గతంలో కవిత సామాజిక అంశాలపై అనేక కార్యక్రమాలు చేపట్టారు. పదేళ్లూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఇబ్బందిపెట్టే విధంగా ఆమె కామెంట్లు ఉన్నాయన్న అభిప్రాయం పార్టీ క్యాడర్లో నెలకొన్నది. ఈ అంశం మాట్లాడితే తప్పేందని మీడియా చిట్చాట్లోనూ కవిత కామెంట్ చేశారు.
ఇప్పుడు అదే అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. ఎయిర్పోర్టులో ఆమెకు స్వాగతం పలుకుతూ సామాజిక ఉద్యమకారిణి అంటూ బ్యానర్లలో పేర్కొనడంతో ఇక ఆమె సొంత ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్తారన్న సంకేతాలు పంపినట్లుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టీకప్పులో తుఫానే..
ఇదే అంశంపై ఆమె గతంలోనూ ఉద్యమించినందున కవిత తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేస్తూ కార్యక్రమాలు చేసే అవకాశాలున్నాయని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. గతంలోనూ అనేక కార్యక్రమాలను చేపట్టిన కవిత ఇప్పుడు సామాజిక సమస్యలపై ముందుకుపోవడం అంత కష్టమేమి కాదని కొందరు బీఆర్ఎస్ నేతలు వెలుబుచ్చుతున్నారు.
కానీ, మరికొంత మంది నేతలు మాత్రం కవిత అంశం టీకప్పులో తుపానులా చ ల్లారిపోతుందని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెద్ద అంశమేమి కాదని, కవిత కూడా ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా కేసీఆర్ను కలుస్తారని, సమ స్య సమసిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కవిత అడుగులు ఎటు పడతాయి. ఆమె రాజకీయ ప్రస్థానంపై ఆసక్తి నెలకొన్నది.
కవితపై సస్పెన్షన్కు రంగం సిద్ధమైందా?
అంతర్గత అంశాలను బహిర్గతపర్చడం ద్వారా కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉం టాయా అనే అంశం కూడా మీడియా సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇటు కేటీఆర్ కూడా పార్టీ ఫోరాల ద్వారా వ్యక్తపర్చాల్సిన అంతర్గత అంశాలను అంతర్గతంగా చెప్పాలని, పార్టీలో ఏ స్థాయి నేతకైనా ఇదే వర్తిస్తుందని చెప్పడం దీనికి బలం చేకూరినట్లుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇటు కాంగ్రెస్ నేతలు సైతం కవితపై క్రమశిక్షణ చర్యలు పార్టీ తీసుకుంటారని కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్తో కవిత సమావేశమైతే సమస్య సర్దుకుంటుందున్న భావన పార్టీ శ్రేణుల్లో నెలకొన్నది. కవితపై ఒకవేళ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్లో పెను ప్రకంపనలు సృష్టించనుంది.