25-05-2025 12:20:21 AM
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): రాష్ర్టంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ వైద్య కళాశాలల జూనియర్ డాక్టర్లు శనివారం రాష్ర్టవ్యాప్త నిరసన చేపట్టారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇస్తున్న మాదిరిగా స్టుఫైండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్, ప్రభుత్వ వైద్య కళాశాలల ఇంటర్న్లు, పీజీ డాక్టర్లకు సమానంగా స్టుఫైండ్ ఇవ్వాల్సిందిగా స్పష్టంగా పేర్కొన్నా పలుచోట్ల ప్రైవేట్ వైద్య కళాశాలలు ఇప్పటికీ ఇంటర్న్లకు, పీజీ విద్యార్థులకు స్టుఫైండ్ ఇవ్వడం లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఈ ఆందోళనలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ జూడా), తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ) తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.