07-06-2025 10:54:33 PM
ముఖ్యమంత్రి రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా ఎల్లారెడ్డికి అవకాశం రానుందా..
సీనియర్ వర్సెస్ జూనియర్..
ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఆ జిల్లాలో ఓ పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పోటాపోటీ నెలకొంది. ఒకరు తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగా.. మరొకరు మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రజాప్రతినిధి. ముఖ్యమంత్రి సహా కొందరు సీనియర్లు ఆ మాజీ మంత్రికి జై కొడుతుంటే ఢిల్లీ పెద్దలు మాత్రం.. ఆ జూనియర్ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆ క్రమంలో ఆ ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ స్టార్ట్ అవ్వడంతో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కాంగ్రెస్ పెద్దల ఫార్ములా ఓకే అయిందంట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? వారి మధ్య రాజీ కుదిర్చిన ఫార్ములా ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(Nizamabad District) హస్తం పార్టీలో.. మంత్రి పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది.
బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు లు రేవంత్ క్యాబినెట్ లో బెర్త్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తన పేరు పరిశీలించాలంటూ రాహుల్ టీంతో ఒత్తిడి చేయిస్తున్నారట. దాంతో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైనా.. మదన్ మోహన్ ప్రయత్నాలతో అధికార ప్రకటనలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందంటున్నారు. రాహుల్ టీం మదన్ మోహన్ పేరు సిఫార్సు చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారట.
అదే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పొలిటికల్ ఫైట్కు కారణమైందంట. సీనియర్ ఎమ్మెల్యే.. జూనియర్ ఎమ్మెల్యే మధ్య రాజీ కుదుర్చేందుకు హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నా.. సమన్వయం కుదరటం లేదట. మంత్రివర్గ విస్తరణ జాప్యానికి.. ఇదో కారణంగా చెబుతున్నారు. ఇక ఐటీ మంత్రి పదవికి అన్ని అర్హతలూ ఉన్న మరొక యువ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డి నుంచి గెలిచి, తాజాగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన మదన్ మోహన్ కూడా విద్యాధికుడు. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీనుంచి ఎమ్మెస్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన మదన్ మోహన్, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
యుఎస్ఎమ్ గ్రూప్ చైర్మన్ గానూ, యుఎస్ఎమ్ బిజినెస్ సర్వీసెస్ సిఇఓగానూ వ్యవహరిస్తున్నారు. అనలిటిక్స్ డేటా సర్వీసెస్ సంస్థలో భాగస్వామిగానూ ఉన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి.. తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా.. మిస్ అయింది. సుదర్శన్ రెడ్డి సేవలను స్పీకర్ గా వినియోగించుకోవాలని పార్టీ పెద్దలు ప్రతిపాదిస్తే భావించినా.. ఆయన ససేమిరా అన్నారట. క్యాబినెట్ బెర్త్ కోసం పట్టుబట్టి .. అంతా ఓకే అనుకునే సమయానికి.. నేనున్నానంటూ తెరపైకి మదన్ మోహన్ వచ్చారట. రాహుల్ టీమ్తో రాయబారాలు నడిపారంట. దాంతోమంత్రి వర్గ విస్తరణ జరిగితే.. మదన్ పేరు పరిశీలించాలని ఢిల్లీ పెద్దలు చెప్పారట. దాంతో ఆ పక్రియ మళ్లీ మొదటికొచ్చిందట.
ఐతే ఇటీవల పార్టీ పెద్దలు మదన్తో చర్చలు జరిపి చీఫ్ విప్ పదవి ప్రతిపాదన చేశారట. ఆ ప్రతిపాదనకు నో చెప్పలేక ఎస్ అనలేక సర్దుకుపోతా అని మదన్ సంకేతాలిచ్చారట. అయినా కొద్ది రోజులు మదన్ మోహన్ పట్టు వదలకుండా తన ప్రయత్నాలు ఢిల్లీ చుట్టూ కొనసాగిస్తున్నారు. ఎట్టకేలకు ఢిల్లీ పెద్దలు కొలిక్కి తెచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనేది కొంచంగా మారింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మంత్రి పదవి వస్తుందని ఆశ భావంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి సీఎం క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కాలని నియోజకవర్గంలోని నాయకులు ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
త్వరలోనే కొలిక్కి రానున్న మంత్రి పదవి. మరి ఎవరికి ధక్కునో.