calender_icon.png 18 June, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ జైకొట్టేదెవరికి?

18-06-2025 01:15:02 AM

చెక్‌పోస్ట్ సెంటర్‌లో తేల్చుకుందామా!

మూడు పార్టీలకు కీలకం కానున్న ఉప ఎన్నిక

  1. ‘మాగంటి’ హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానం
  2. సీటు కాపాడుకోవాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్
  3. కాంగ్రెస్ పాలనకు రెఫరెండంలా బైపోల్
  4. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నాయకత్వానికి సవాల్‌గా ఎన్నిక
  5. నిర్ణయాత్మక శక్తిగా ఎంఐఎం.. ఎవరికి మద్దతునిచ్చేనో?

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అత్యం త ప్రతిష్ఠాత్మకం కాబోతోంది. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మరో ఆర్నెళ్లలో ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి, సీఎంగా  రేవంత్‌రెడ్డి పాలనపై ఒక రకంగా రెఫరెండం లాగే భావించవచ్చు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజాతీర్పు అనుకోవచ్చు.

ఇక సిట్టింగ్ స్థానం కావ డం, కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా తలపడుతున్న బీఆర్‌ఎస్‌కు ఇది సిట్టింగ్ సీటు కనుక ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకం. ఇక్కడ గెలవాల్సిన అనివార్యత ఆ పార్టీకి ఉంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జూబ్లీహిల్స్ బైపోల్ ప్రతిష్ఠాత్మకం కానున్నది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిషన్‌రెడ్డి ప్రాతి నిధ్యం వహించే సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోకే వస్తుంది. దివంగత మాగంటి గోపీనాథ్ వరుసగా 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సృష్టించారు. గోపీనాథ్ ఒకసారి ఎంఐఎంను, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి విజయం సాధించారు. 

ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షస్థానంలోకి వచ్చింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు గౌరవప్రదమైన సీట్లు రావడానికి కారణం గ్రేటర్ హైదరాబాద్‌లో ఏక పక్షంగా సీట్లు గెలవడమే. గ్రేటర్ పరిధిలో గోషామహాల్‌లో బీజేపీ, పాతబస్తీలోని ఏడు సీట్లలో ఎంఐఎం గెలిచింది. ఇక మిగతా అన్ని సీట్లలో బీఆర్‌ఎస్ పార్టీనే విజయదుందుభి మోగించింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నా కూడా గ్రేటర్‌లో మాత్రం పాగా వేయలేకపోయింది. అయితే లాస్యనందిత మృతి తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌కు మరో ఆర్నెళ్లలో ఉప ఎన్నిక రాబోతుండటంతో సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కారు పార్టీ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్రస్థాయిలో నడుస్తోంది.

గులాబీ అగ్రనేతలపై వరసగా విచారణలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నిక కారు పార్టీ ప్రతిష్టకు పెనుసవాల్‌గా మారింది. గోపీనాథ్ కుటంబం నుంచి అభ్యర్థిని పోటీకి దింపుతారా లేక ఇంకో స్థానిక నేతను బరిలోకి దింపుతారా అనే చర్చ రాజకీయ వర్గా ల్లో విస్తృతంగా జరుగుతోంది.

గోపీనాథ్ ఫ్యామిలీ నుంచి కాకుండా ఇంకో నేతను ఎంపిక చేయాల్సి వస్తే దివంగత నేత పీజేఆర్ తనయుడు గతంలో ఒకసారి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన పీ విష్ణువర్ధన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ తర్వాత పార్టీలో సీనియర్ నేత శ్రీధర్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలోకి వస్తోంది. 

కాంగ్రెస్ పాలనకు పరీక్ష..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ పరిధిలో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించింది. ఆ సమయంలోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ 4,23,068 ఓట్లు సాధించి 49,944 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకుముందు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్ 64,212 ఓట్లు సాధించి 16,337 ఓట్ల తో గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు.

రాబో యే ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తన పాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు ఉంటుంది. అయితే అభ్యర్థుల ఎంపిక ఒక రకంగా కాంగ్రెస్‌కు కత్తి మీద సామే. గతంలో పోటీచేసిన మహ్మద్ అజారుద్దీన్‌కు హస్తం పార్టీలోని అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన తన అభ్యర్థితత్వం కోసం గట్టిగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇటీవల క్యాబినెట్ కూర్పులో ముస్లింలకు బెర్త్ దొరకకపోవడం, హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు లేకపోవడం, అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం మైనార్టీ ఓట్లు అజారుద్దీన్‌కు కలిసి వచ్చే అంశాలు. ఆయనతో పాటు పీజేఆర్ కూతురు విజయారెడ్డి, 2014లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి మాగంటికి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన నవీన్ యాదవ్ ఇక్కడ పోటీకి తమ ప్రయత్నాలు తీవ్రతరం చేసే అవకాశాలున్నాయి. నవీన్ యాదవ్‌కి బీసీగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ బైపోల్ అత్యంత కీలకంగా మారింది. 

కిషన్‌రెడ్డికి సవాల్..

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఉండటంతో ఇక్కడ గెలువడం ఆయనకు అత్యంత కీలకం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీగా చేసిన లంకల దీపక్‌రెడ్డి 25,866 ఓట్లు సాధించి 14.11శాతాన్ని నమోదు చేసుకున్నారు.

ఇక్కడ తిరిగి లంకల దీపక్‌రెడ్డినే పోటీకి నిలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. పోటీకి చాలామంది కమలం పార్టీ నేతలు తమ ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఏపీలో టీడీపీ, జనసేనతో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కమలం పార్టీ రాబోయే ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీల మద్దతుతో బరిలోకి దిగితే ఇక్కడ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

దీంతోపాటు జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి.. గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో 30 శాతానికి మించి ఉండటంతో మజ్లిస్ పార్టీ వైఖరి కూడా ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన మజ్లిస్ అప్పుడు పోటీలో ఉన్న మాగంటికి గట్టి పోటీ ఇచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంఐఎం తీసుకునే నిర్ణయం కూడా విజయావకాశాలను గణనీయంగా ప్రభావితం చేయనున్నది.