calender_icon.png 5 June, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకులు సిఫారసు చేసినోళ్లకే ఇండ్లు ఇస్తరా?

02-06-2025 12:27:56 AM

పేదోళ్లకు అన్యాయం చేస్తే ఊరుకోం బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు  శంకర్ బాబు

హుస్నాబాద్, జూన్ 1 : ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో కాంగ్రెస్ నాయకుల పైరవీలతోపాటు అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు విమర్శించారు. అర్హులైన పేదల కలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ పథకాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.

ఆదివారం ఆయన హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 2000 దరఖాస్తులు రాగా,  మంత్రి పొన్నం ప్రభాకర్ 144 మందికి మాత్రమే పట్టాలు అందజేసి పేదలకు మొండిచేయి చూపారని విమర్శించారు. అవయినా అర్హత లేని వారికి, ధనికులకు, కాంగ్రెస్ నాయకుల బంధువులకు, మిత్రులకు మాత్రమే దక్కాయని ఆరోపించారు. 

మంత్రి హామీలు గాలికే..

కే.బీ. కాలనీలో 30 ఏండ్ల కిందట మంజూరైన 200 ఇందిరమ్మ ఇండ్లు శిథిలావస్థకు చేరాయని, గత ఎన్నికల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కాలనీని సందర్శించి, గెలిచిన తర్వాత అందరికీ ఇండ్లు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని శంకర్ బాబు గుర్తు చేశారు.

అయితే, ఇప్పుడు మంజూరైన ఇండ్లలో  10 ఇండ్లను మాత్రమే కే.బీ. కాలనీకి కేటాయించి మంత్రి  మాట తప్పారని దుయ్యబట్టారు. గత ఎమ్మెల్యే మాదిరిగానే మంత్రి కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆక్షేపించారు.

 జాబితా గోప్యతపై ప్రశ్నలు..

ఇందిరమ్మ ఇండ్ల జాబితాను అధికారులు ఎందుకు బహిరంగంగా ప్రకటించడం లేదని శంకర్ బాబు ప్రశ్నించారు. ఈ గోప్యత వెనుక అంతర్యం ఏమిటని నిలదీశారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరైతే, లెక్క ప్రకారం హుస్నాబాద్ పట్టణానికి 437 ఇండ్లు రావాల్సి ఉండగా, 144 ఇండ్లు మాత్రమే ఇచ్చి పట్టణాన్ని విస్మరించారని విమర్శించారు. గత ఎమ్మెల్యే మాదిరిగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ పట్టణంలోని పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

నిబంధనలపై అభ్యంతరం...

ఒక్క మనిషి జీవితంలో ప్రధానమైన కోరిక, కల ఇల్లు కట్టుకొని కుటుంబంతో సంతోషంగా జీవించడం. కానీ ఇందిరమ్మ ఇండ్లకు నిబంధనలు పెట్టి, కొత్త ఇల్లు కట్టుకుందామనే సంబురం లేకుండా పోయింది‘ అని శంకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 400 నుంచి 600 చదరపు అడుగులలో ఇల్లు  నిర్మిస్తేనే బిల్లు వస్తుందని, లేకపోతే జాబితా నుంచి తొలగిస్తామని లబ్ధిదారులను భయపెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

ఈ నిబంధన ఉమ్మడి కుటుంబాలకు, ఇంట్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉన్నవారికి ఇబ్బందులు సృష్టిస్తుందని, ఇల్లు కట్టుకున్నా సంతోషం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్ల  నిబంధనలను సడలించి, లబ్ధిదారుల కోరిక మేరకు ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, లబ్ధిదారుల జాబితాపై సమగ్ర విచారణ జరిపించాలని, హుస్నాబాద్ పట్టణానికి రావలసిన మిగిలిన 293 ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు.

లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆపార్టీ సీనియర్ నాయకులు పోలోజు రవీందర్, వరియోగుల అనంతస్వామి, బోడిగె వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.