21-10-2025 11:13:27 PM
పాపన్నపేట (విజయక్రాంతి): ఇంట్లో గొడవపడి వెళ్లి మంజీర నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏడుపాయల్లో మంగళవారం వెలుగుచూసింది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. రామాయంపేట మండలం కోమట్పల్లికి చెందిన రేణమ్మ(45) సోమవారం ఇంట్లో గొడవ పడి ఏడుపాయలకు వచ్చింది. మొదటి బ్రిడ్జి దగ్గర మంజీర నదిలో దూకింది. కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. కాగా మంగళవారం సాయంత్రం నదిలో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులు ఆమె భర్త మల్లేష్ కు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.