25-06-2025 05:18:23 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి నేటితో 50 ఏళ్ళు నిండాయని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యవాదులను గృహ నిర్బంధం చేశారని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్(BJP Mandal President Uppunutala Ramesh) విమర్శించారు. 50 ఏళ్ళ నాటి కాంగ్రెస్ రచించిన దమనకాండను నిరసిస్తూ ‘సంవిధాన్ హత్యా దివస్’ కార్యక్రమంలో భాగంగా రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి లాంగ్ లివ్ డెమోక్రసీ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో తన అధికారాన్ని కాపాడుకోవటం కోసం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించి, అనేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ప్రజలను క్రూరహింసలకు గురిచేసి దేశం మొత్తాన్నే జైళ్లుగా మార్చిందని ఆరోపించారు. అన్ని ప్రాథమిక హక్కులను రద్దు చేసి, ప్రతిపక్ష నాయకులందరిని రాత్రికి రాత్రే మీసా కింద అరెస్ట్ చేసి 21 నెలల పాటు వాళ్ళును జైళ్లలో పెట్టి, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
సంవిధాన్ హత్య దివస్ పాటించడం వల్ల ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ, మన ప్రజాస్వామ్య రక్షణ యొక్క శాశ్వత జ్వాల వెలుగులో నిలిచి ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ వంటి నియంతృత్వ శక్తులు ఆ భయానక సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా కోశాధికారి వోలం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు రడం వెంకన్న, సహాయ కార్యదర్శి రామడుగు వెంకటాచారి, మండల ప్రధాన కార్యదర్శులు బోగోజు నాగేశ్వరచారి, బోనగిరి ఉపేందర్, గాంతి వెంకట్ రెడ్డి, కోశాధికారి లెంకలపల్లి శ్రీనివాస్, జుజ్జూరు వీరభద్రచారి, బొల్లోజు వీరన్న , సింగంశెట్టి మధుకర్, కాసోజు కృష్ణమాచారి, వేం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.