21-06-2025 02:57:16 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): జీవనశైలిలో మార్పుకు యోగా దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటుగా మార్చుకోవాలని యోగా గురువులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో సైతం యోగా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. యోగా వల్ల అనేక లాభాలు ఉన్నాయని, మానసిక ఒత్తిడిని జయించవచ్చని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగ వేడుకల్లో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్, వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్ , యోగా దినోత్సవం నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో ప్రకృతి వైద్య నిపుణులు, యోగా గురువు డాక్టర్ జీవీఎం చారి వాకర్స్, క్రీడాకారులకు యోగ వల్ల కలిగే లాభాలను వివరించారు. కేసముద్రం బల్దియా పరిధిలోని స్టేషన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగా డే ఆకారంలో విద్యార్థులు కూర్చుని ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే కల్వల జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఇదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో యోగా డే వేడుకలు నిర్వహించి, యోగ వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు.