06-11-2025 07:39:03 PM
గద్వాల (విజయక్రాంతి): పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన యుడైస్ వివరాలు ఎప్పటికప్పుడు పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యు డైస్ లో అప్డేట్ చేసిన వివరాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు సరిపోలేలా ఉన్నాయో లేదో చూసుకునే బాధ్యత ఆయా మండలాల విద్యాధికారులపై ఉందన్నారు. విద్యాశాఖకు సంబంధించి వివిధ యాప్ ల నిర్వహణ, ఇతర విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలల వివరాలు, ఎక్కడెక్కడ సివిల్ పనులు జరుగుతున్నాయి, పూర్తిస్థాయిలో మౌలిక వసతులు అవసరం ఉన్న పాఠశాలల వివరాలు వారంలోగా పక్కాగా సేకరించాలని ఆదేశించారు. పాఠశాలలకు మంజూరయ్యే నిధులు వేటికి ఖర్చు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈడబ్ల్యూ ఐడిసి (ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఇంజనీర్లు కూడా ఎప్పటికప్పుడు తరగతి గదులు నిర్మాణం, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు చేస్తున్న పనులను పర్యవేక్షించాలన్నారు.
కంప్యూటర్లు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకునేలా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో మొత్తం 396 పాఠశాలలకు గాను ఇంటర్నెట్ కనెక్టివిటీ కేవలం 16 పాఠశాలలోనే ఉందని, మిగతా చోట్ల ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి వినియోగించుకోవాలని సూచించారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వీడియోలను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇంటర్ నోడల్ అధికారి హృదయరాజు, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడిసి డిఈ వెంకట్ రెడ్డి, ఏఈలు మోహన్ రెడ్డి, ఆజాం, సెక్టోరియల్ అధికారులు హంపయ్య, శాంతిరాజు, ఎంఈఓ లు, తదితరులు పాల్గొన్నారు.