04-12-2025 12:48:04 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : గ్రామపంచా యతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు కావలసిన ధ్రువపత్రాలు అన్ని ఇచ్చారో లేదో సక్రమంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం ఉదయం మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపన గండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది.
ఈ నేపథ్యంలో కలెక్టర్ పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో, శ్రీరంగాపురం మండలం కంబాలపురం గ్రామపంచాయతీ కార్యాలయం, శ్రీరంగాపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు.
కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు కావలసిన ధ్రువపత్రాలు అన్ని ఇచ్చారో లేదో సక్రమంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గానీ పోటీ చేయు అభ్యర్థికి ప్రతిపాదించే వ్యక్తి ఏ కులం వారైనా అయ్యుండొచ్చని అందులో సందేహం అవసరం లేదని సూచించారు. ఆయా మండలాలు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, కలెక్టర్ వెంట ఉన్నారు.