10-01-2026 12:00:00 AM
విద్యార్థినులకు కలెక్టర్ హితవు
నిజామాబాద్, జనవరి 9 (విజయ క్రాంతి): ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఉద్యాన్ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్టడీ టూర్ (అధ్యయన యాత్ర)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు హితవు పలికారు. సికింద్రాబాద్, బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యాన్ ఉత్సవ్ లో ప్రదర్శనలను తిలకించేందుకు వీలుగా ప్రభుత్వం తరపున మోపాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 52మంది విద్యార్థినులను జిల్లా యంత్రాంగం తరపున ఎంపిక చేశారు.
వీరిని శుక్రవారం ప్రత్యేక బస్సులో రాష్ట్రపతి నిలయంకు పంపించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థినులు వెళ్తున్న బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యాన ఉత్సవ్ లో ఎన్నో రకాల పుష్పాలు, మొక్కలను ప్రదర్శనలో ఉంచుతారని, వాటి గురించి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. కాగా, స్టడీ టూర్ కు వెళ్తున్న బాలికలకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, ఉద్యానవన శాఖ ఏ.పీ.డీ భారతి తదితరులు పాల్గొన్నారు.