07-06-2025 11:11:28 PM
పరారీలో నిందితులు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam) పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. మనస్పర్థల కారణంగా కక్ష్యలు పెంచుకొని, గాలివాన చిలికి చిలికి పెను తుపానుగా మారి భగ్గుమని నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన శనివారం పట్టణంలో కలకలం లేపింది. కొందరు వ్యక్తులు ఒక యువకుడిని తన ఇంటి వద్దనే అర్థరాత్రి సమయంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పొట్టలోని పేగులు బయటకు వచ్చేలా పొడిచి చంపిన ఘటన వెలుగు చూసింది. దాడి చేసిన నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునికి గల కారణాలను కూపీ లాగే వనిలో నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... పట్టణంలో అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) కాలనీకు చెందిన కణితి సతీష్ (25) అనే యువకుడిపై జగదీష్ కాలనీకి చెందిన మరోక వ్యక్తి గల పాత కక్ష్యలను మనస్సులో పెట్టుకుని అతని స్నేహితులతో కలిసి గొడవ పడ్డారు. గొడవ అనంతరం ఇంటికి చేరుకున్న సతీష్ పై సుమారుగా 11:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దాదాపు 10 మంది వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన సతీష్ సోదరుడు రమణను సైతం చితకబాదారు. సోదరుడి భార్య సౌజన్య అరుపులతో ఒక్కసారిగా ఉలికిపడిన స్థానికులు లేచి చూసేసరికి రక్తపు మడుగులో సతీష్ ఉన్నాడని, అప్పటికే చనిపోయాడని నిర్ధారించుకుని దాడికి పాల్పడిన వ్యక్తులు వెళ్లిపోయారు.
తమ్ముణ్ణి కొడుతున్న సమయంలో అడ్డు వచ్చిన సతీష్ సోదరుడిని సైతం రోకలిబండతో చితక బాధారని పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులలో తమ పక్క కాలనీ అయిన జగదీష్ కాలనీకు చెందిన వ్యక్తిని గుర్తు పట్టినట్లుగా సదరు వ్యక్తితో సతీష్ తరుచూ గొడవ పడే వాడని, ఈ గొడవల వ్యవహారం సుమారు సంవత్సరన్నర నుంచి నడుస్తుందని, ఈ దాడికి కూడా కారణం అదే అవి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలియజశారు.
వెంటనే క్షతగాత్రుడైన సతీష్ ని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దాడికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. దాడికి మొత్తం 10 మంది పాల్పడ్డట్లుగా నిర్ధారించుకున్నారు. మృతుడు సతీష్ సోదరుడైన రమణ భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు సీఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.