calender_icon.png 23 June, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తులో చిత్తవుతున్న యువత

04-09-2024 12:00:00 AM

డా. బి.కేశవులు నేత :

రెండు తెలుగు రాష్ట్రాల్లోని యవత మత్తులో చిత్తయి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నది. ఎక్కువ శాతం విద్యార్థులే దీనిపట్ల విపరీతంగా ఆకర్షితులై తమ కుటుంబాలకూ తీరని ఆవేదనను, దుఖాన్ని కలిస్తున్నారు. మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వాటిని పొందడానికి ఎంతకైనా బరితెగిస్తున్నారు. డ్రగ్స్ కొనడానికి డబ్బులు లేకపోవడంతో చోరీల బాట పడుతున్నారు. ఇందులో విద్యార్థినులు సైతం బలవుతున్న సంఘటనలు కోకొల్లోలు. ఆ మధ్య మత్తుకు అలవాటైన ఓ యువకుడు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చిన ఘటన, ఓ విద్యార్థిని మత్తులో తన నగ్నచిత్రాలను అమ్మేందుకు సైతం సిద్ధపడిన సంఘటనలు సభ్యసమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి. 

అధిక నేరాలకు అసలు కారణం

90 శాతానికి పైగా నేరాలు, ఘోరాలు మద్యం, మత్తు పదార్థాల మత్తులోనే జరుగుతున్నాయని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. దీన్నిబట్టి వీటివల్ల నష్టం ఎంతగా ఉందో అంచనా వేయవచ్చు. రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం విక్రయాలు, గంజాయి లాంటి డ్రగ్స్ లక్షలాది కుటుంబాలను నడిరోడ్డున పడేస్తున్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వాళ్లకు అడిగినంతగా బార్లకు, పబ్‌లకు, రెస్టారెంట్లకు, బెల్ట్ షాపుల (అనధికార)కు అనుమతులు ఇస్తున్నది. 8 సంవత్సరాల క్రితం 30-  -32 పబ్బులుంటే, నేడు వాటి సంఖ్య 110కి పైగా ఉంది. ఇందులో 70 శాతానికి పైగా రాజకీయ నేతలు లేదా వాళ్ళ దగ్గరి అనుచరులే నడిపిస్తున్నారు. అనుమతులు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ, వాటి నియంత్రణలో కనిపించడం లేదు.

తెలంగాణ వచ్చినప్పుడు 2,216 వైన్ షాప్స్ ఉండగా, ప్రస్తుతం 2,620కి పెరిగింది. 2014లో 1,060 బార్లు ఉండగా, నేడు 1220కి పెరిగాయి. తెలంగాణ వచ్చిన 2014 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు లిక్కర్ ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఆనాడు రూ.10,800 కోట్లు ఉండగా, 2021- రూ. 31 వేలకోట్లకు పైగా పెరిగింది. నేడు పల్లెల్లో మద్యం ఏరులై పారుతున్నది. రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుదలకు ఈ మద్యం కారణం అవుతున్నదని చాలామంది మహిళలు ఆవేదన చెందుతున్నారు. జనం ఎంత తాగితే అంత ఆదాయం వస్తుందని ప్రభుత్వం చూసీచూడనట్లుగా వదిలేస్తున్నది. ఫలితంగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి అడ్డదారిన డబ్బులకోసం నేరాలకు పాల్పడుతున్నారు.

టీనేజ్ విద్యార్థులే లక్ష్యంగా..

గంజాయి, ఇతర మత్తు పదార్థ్ధాలను విక్రయించే వారు విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని వారికి వల వేస్తున్నారు. విద్యార్థులు క్రికెట్ లాంటి ఆటలు ఆడే సమయంలో, సినిమాలు, షికార్లకు వెళ్లినప్పుడు, కళాశాలలకు డుమ్మా కొట్టి నదులు, చెరువులవద్ద ఈత కొడుతున్నప్పుడు, కేఫ్‌లలో సిగరెట్లు తాగుతున్న సమయంలో, బార్లు, బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నప్పుడు, వారిని గంజాయి మాఫియా గ్యాంగ్ సభ్యులు రహస్యంగా గమనిస్తుంటారు. సందర్భాన్నిబట్టి వారితో మాటలు  కలుపుతారు. మొదట స్నేహితుల్లాగా మాటలు కలుపుతూ ఉచితంగా కొంత గంజాయిని, మత్తు పదార్థాన్ని ఇచ్చి, వాటిని సేవిస్తే వచ్చే ఆనందమే వేరంటూ తియ్యటి మాటలు చెబుతారు.

ఇలా నెమ్మదిగా విద్యార్థులను డ్రగ్స్‌కు అలవాటు చేస్తూ, అవి లేకుండా ఉండలేని పరిస్థితి కల్పిస్తూ, ఆ తర్వాత అధిక ధరలకు వాటిని విక్రయిస్తున్నారు. పలు జాతీయ సర్వేల ప్రకారం మత్తు పదార్థాల సేవనం వల్ల 75 శాతం మందిలో 25 శాతం మందికి అత్మహత్య ఆలోచనలు వస్తుంటే, 25 శాతం మంది శారీరక సమస్యలకు తీవ్రంగా గురవుతారు. 58 శాతం మందిలో 42 శాతం మంది ఒత్తిడికి, మానసిక సమస్యలకు గురవుతారు. 75 శాతం మందిలో 25 శాతం మంది భార్యలనుంచి విడాకులు కోరుతున్నారు. 60 శాతం మంది యువతలో 40 శాతం మందికి పైగా నేరపూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. 55 శాతం యువతలో 45 శాతానికి పైగా సెక్స్‌లో శీఘ్ర స్కలనం సమస్యకు గురవుతున్నారు. 70 శాతం మందిలో 24 శాతం మంది స్థూలకాయం లాంటి సమస్యలతో  బాధ పడుతున్నారు.

గంజాయి మాటున రాజకీయాలు

గంజాయికి అలవాటు పడుతున్న వారు, దీనిని రవాణా చేస్తున్న వారు కూడా ఎక్కువగా 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. విద్యార్థులు, కూలీలు, జల్సాల కోసం కొందరు, జీవనోపాధి కోసం మరికొందరు గంజా మాఫియా ఉచ్చులో పడుతున్నారు. కేవలం ఒక్కసారి రవాణా చేస్తే చాలు, నెలకు సరిపడే ఆదాయం వస్తుంది. ఫలితంగా నెల మొత్తం కష్టపడాల్సిన పని లేకుండా డబ్బులు సంపాదించవచ్చనుకొనే అత్యాశ వ్యాపారులు కూడా గంజాయి లాబీ మాయలో సులభంగా పడి, స్వల్ప కాలంలోనే ఆర్థికంగా ఎదుగుతున్నారు.

గల్లీ లీడర్లు చూస్తుండగానే గంజాయి మాటున రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. అనైతికంగా సంపాదించిన డబ్బుతో గ్రామీణ ప్రాంతాల్లో యువతను పెడదోవ పట్టిస్తున్నారు. తమ అవసరాలకు వాడుకుంటూ, వాళ్లను గంజాయి మత్తుకు బానిసలను చేస్తున్నారు.  నేడు గ్రామ ప్రాంతాలలోనూ నేర ప్రవృత్తి పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.

నయా రూట్లలో భారీ దందా 

ఆన్‌లైన్ ద్వారా వస్తువుల విక్రయం పెరిగి పోవడంతో మాదక ద్రవ్యాల వ్యాపారులు దీన్నొక సువర్ణావకాశంగా మలచుకుంటున్నారు. దశాబ్ద కాలంగా ఆన్‌లైన్, కొరియర్ వ్యవస్థ ద్వారా వేర్వేరు దేశాలకు, మన దేశంలోని విభిన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న ముఠాల గట్టు రట్టు చేసిన సంఘటనలు కోకొల్లలు. ఆ తరువాత ఏమి జరుగుతున్నదో అర్థం కావడం లేదు.

ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకొని ఆన్‌లైన్, కొరియర్ ద్వారా లేదా వాళ్ల సొంత ముఠా సభ్యులద్వారా సరఫరా అవుతున్న డ్రగ్స్ వ్యాపారం కోట్ల రూపాయల్లో ఉందంటే ఈ నిషేధిత వ్యాపార స్థితిని చేసుకోవచ్చు. కొకైన్, హెరాయిన్ వంటివి ఎవరికీ అనుమానం రాకుండా టాబ్లెట్స్ రూపంలో సరఫరా చేస్తున్నారు. ఇవి అత్యంత ఖరీదైన మత్తు పదార్థాలు కావడంతో దొరికితే కోట్లలో నష్టం రావడంతో దానికంటే గంజాయినే రవాణా చేయడం సులువు అనుకుంటున్నారు. గంజాయిని మాత్రలు ఆయిల్, పౌడర్ల రూపంలో, సులభంగా తీసుకెళ్లే వీలు ఉండటంతో విచ్చలవిడిగా అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అలాగే పబ్బుల్లో, రెస్టారెంట్లలో ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా వాడుతున్న చేదు అనుభవాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం.

తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి

సరదాగా మొదలైన మత్తు పదార్థాల వాడకం  క్రమేణా వ్యసనంగా మారి బాధితులను చిత్రవధ చేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడితే చాలావరకు యువతను మత్తు పదార్థాల బారినుండి కాపాడవచ్చు. పాశ్చాత్య పోకడలను అనుకరిస్తూ యువకులు తమ భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారు. పబ్‌లు, క్లబ్‌లు ఏకంగా రేవ్ పార్టీలకు, రేవ్ డ్యాన్స్‌లకు వెళ్తున్న విషయాన్ని తల్లిదండ్రులు గొప్పగా, స్టేటస్ సింబల్‌గా ఫీలవడం దురదృష్టకరం. మనిషిని పీల్చి పిప్పి చేసే, ఈ వ్యసనాలను నుండి వీలైనంత తొందరగా బయటపడక పోతే ఈ మత్తు మనిషిని పూర్తిగా దహించి వేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

 వ్యాస రచయిత చైర్మన్, 

జాతీయ యాంటీ డ్రగ్స్ సంస్థ

సెల్: 85010 61659