calender_icon.png 22 June, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారసుడు బుద్ధిమంతుడు కావాలి

04-09-2024 12:00:00 AM

ఏకేనాపి సువృక్షేణ 

పుష్పితేన సుగంధినా

వాసితం తద్వనం సర్వం, 

సుపుత్రేణ కులం యథా॥

- చాణక్య నీతి: -3--14

తోటలో ఎక్కడైనా చక్కని పరిమళ భరితమైన పూవుల చెట్టు ఒక్కటున్నా ఆ తోటంతా పరిమళపూ రితమైన విధంగా, గుణవంతుడైన కుమారుడు ఒక్కడున్నా వంశం ప్రఖ్యాతిని పొందుతుంది.

ఒకప్పుడు ఏకపాదుడనే గురువు శిష్యులతో వేదపాఠాలను వల్లె వేయిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన వేదాన్ని వల్లె వేయించే సమయంలో స్వరం తప్పింది. అప్పుడు అతని భార్య సుజాత గర్భంలో ఉ న్న బాలుడు అది గ్రహించి, తండ్రిని స్వరం తప్పావని హెచ్చరించాడు. ఒకవైపు తనకు జన్మించ బోయే కుమారుడు పండితుడని సంతోషించినా, తనను తప్పు పట్టాడనే కోపంతో ఏకపాదుడు గర్భస్థ శిశువును ఎనిమిది వంకరలతో జన్మించమని శపించాడు. 

ఆ కాలంలో జనక మహారాజు సభలో పలు జ్ఞానాంశాలపై చర్చలు జరుగుతూ ఉండేవి. అక్కడ వంది అనే పండితుడు ‘తనతో చర్చించి ఓడినవారు తనకు సేవకులుగా పనిచేయాలని, తానోడితే వారికి సేవకునిగా ఉంటానని’ ప్రకటించాడు. అలా ఉద్ధండ పండితులను ఓడించి సేవకులుగా చేసుకున్నాడు. ఏకపాదుడు కూడా తన విజ్ఞానంపై అపారమైన విశ్వాసంతో ఆ సభలో చర్చించి ఓడిపోయి బానిస అయ్యాడు. 

ఇదిలా ఉండగా.. సుజాత ప్రసవించి మగశిశువు కు జన్మనిచ్చింది. తండ్రి శాపానుగుణంగా ఎనిమిది వంకరలతో జన్మించిన పిల్లవానికి ‘అష్టావక్రుడు’ అని నామకరణం చేసారు. ఎనిమిది సంవత్సరాలు వచ్చేవరకు ఆ బాలుడు, వేదవేదాంగాలతోసహా పలు జ్ఞానవిషయాలపై అమితమైన పాండిత్యాన్ని సాధించాడు. తండ్రి గురించిన విషయాలు తల్లి చెప్పగా విని, తండ్రికి దాస్య విముక్తిని సాధించాలనే లక్ష్యంతో జనకుని సభకు చేరుకొని వందితో వాదించి అతనిని ఓడించాడు. ఓడిన వందిని తన తండ్రికి దాస్య విముక్తిని కోరుకుంటాడు.

వంది కూడా సంతోషించి అష్టావక్రుడిని ఘనంగా సత్కరించి, తండ్రితో సహా పంపిస్తాడు. తండ్రికూడా ప్రయోజకుడైన కుమారుని చూసి ఆనందంతో తన తపస్సును ధారబోసి అతని వంకరలు సరిచేస్తాడు. ఇలా గుణవంతుడు, జ్ఞానవంతుడైన అష్టావక్రుడు తండ్రికి దాస్యవిముక్తిని కలిగించడమేకాక, తన వంశానికీ కీర్తిప్రతిష్ఠలు తెచ్చాడు.

సమన్వయంతోనే కార్యసాధన

ఒక సంస్థలో ముఖ్య నిర్వహణాధికారి కొత్తగా చేరాడు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకై సంస్థను రెండుగా విభజించి, సమాన అధికారాలతో ఇరువురు అధికారులను నియమించాడు. ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచే బాధ్యత ఇరువురిపై పెడుతూ.. ఒకరికి వ్యాపార లావాదేవీలను, మరొకరికి సంస్థ నిత్య కార్యకలాపాల బాధ్యతనూ అప్పగించాడు. ఉద్యోగులందరూ ప్రతిరోజూ తమ నివేదికలను ఇరువురికీ ఇవ్వాలనే నియమం పెట్టాడు.

దీనితో అధికారులు ఇరువురూ తమతమ లక్ష్యాలను అధిగమించేందుకు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. ఇరువురూ ఒకరి సూచనలకు భిన్నంగా మరొకరు సూచిస్తూ ఉంటారు. దీనివల్ల ఉద్యోగులలో గందరగోళం ఏర్పడుతుంది. తీవ్ర అసంతృప్తి పెరిగి పోతున్నది. అప్పుడు ఆ ముఖ్య కార్యనిర్వహణాధికారి మాత్రం తాను ఇరువురినీ ఒత్తిడికి గురిచేస్తూ తన స్థానాన్ని పదిల పరుచుకుంటూ, ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. 

అష్టావక్రుని తండ్రిలాగా.. ఒత్తిడిలో పనిచేసే అధికారుల సామర్థ్యం తగ్గడానికి ముఖ్య కార్య నిర్వహణాధికారియే ఇక్కడ కారణమవుతున్నాడు. ఏకపాదుడు, వంది ఉమ్మడి లక్ష్యంతో సాగితే సాహితీవంశం అభ్యుదయాన్ని చూస్తుంది. అష్టావక్రునిలాగా జ్ఞానమూ, నైపుణ్యం కలిగిన అధికారులను ఇరువురినీ సమన్వయ పరచి, వారు ఒత్తిడిని అధిగమించి, ఫలితాలను సాధించేందుకు అవసరమైన ప్రేరణను ఇవ్వగలిగితే సంస్థలో కొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తాయి. దానితో సంస్థకు ప్రగతి. అలా కాకపోతే సంస్థ అధోగతి పాలవుతుంది. సంస్థ ప్రగతిని సాధిస్తేనే ఉద్యోగులకు మనుగడ, సంస్థకూ ఉనికి.

 పాలకుర్తి రామమూర్తి