calender_icon.png 23 June, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయిస్తే పింఛన్ కట్

05-09-2024 12:00:00 AM

దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చినా ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు. ఇంకా చెప్పాలంటే గతంలోకంటే ఎక్కువగానే జరుగుతున్నాయి. ఫలితంగా  ప్రజల తీర్పు పొంది అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వాలు తెల్లారే సరికల్లా కూలిపోతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,  హిమాచల్‌ప్రదేశ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వా లు ఇలా ఫిరాయింపుల కారణంగా  పడిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చడమే పనిగా బీజేపీ ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా అని నిత్యం భయంభయంగా రోజులు వెళ్లదీస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేయడానికి సంబంధించిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసన సభ బుధవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మంగళవారం అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును ఆమోదించారు.

‘ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న శాసన సభ్యులు ఇకపై పింఛన్ పొందే వెసులుబాటు ఉండదు’ అని ఈ బిల్లులో పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటికే పింఛను పొందుతున్న ఇలాంటి ఎమ్మెల్యేలనుంచి ఆ పింఛన్ మొత్తాన్ని రికవరీ చేసే వీలు కూడా ఈ బిల్లులో ఉంది. హిమాచల్‌ప్రదేశ్ చట్టాల ప్రకారం ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన వారికి నెలకు రూ.36 వేల పింఛన్ ఇస్తున్నారు. ఐదేళ్లకు మించి పదవీకాలం ఉన్న వారికి ప్రతి ఏడాదికి వెయ్యి చొప్పున అదనంగా పింఛను ఇస్తున్నారు.

అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ కీలక బిల్లు తీసుకురావడానికి కారణం లేకపోలేదు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 68 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో 40 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 25 స్థానాలు పొందిన బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదనే అందరూ భావించారు. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కమలం పార్టీ ఆదినుంచి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది.

దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ నిత్యం తమ ఎమ్మెల్యేలపై కన్నేసి ఉండాల్సిన పరిస్థితి ఎదురయింది. అయినా బీజేపీ తన ప్రయత్నాలను మానలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల్లోను పార్టీ విప్‌ను కాదని వీరు అసెంబ్లీకి హాజరు కాలేదు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ ఆరుగురిపై అనర్హత వేటు వేశారు.ఈ దశలో అధికార పార్టీ బలం 34కు పడిపోయింది. ఏ క్షణమైనా ప్రభుత్వం పడిపోవచ్చనే అందరూ భావించారు. 

అనంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఈ ఆరుగురికీ టికెట్లు ఇచ్చింది. కానీ వీరిలో ఇద్దరు మాత్రమే గెలుపొందారు.దీంతో మళ్లీ అసెంబ్లీలో అధికార పార్టీ బలం 40కి చేరుకుంది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు కూడా ఇచ్చే స్థితిలో లేదు. సీఎంతో పాటుగా మంత్రులంతా రెండు నెలల పాటు జీతాలువాయిదా వేసుకున్నారు కూడా. ఇలా సమస్యలు చుట్టుముట్టడంతో అధికార పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంతో పాటుగా ఆర్థికంగా కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఈ బిల్లును తీసుకువచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఈ బిల్లుకు ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో చూడాలి.