త్వరలో ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీ..
ప్రజలకు మరింత మెరుగైన సేవలు
సిద్దిపేట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) / సిద్దిపేట క్రైం : సిద్దిపేట జిల్లా(Siddipet District)లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(Primary Health Center) సిబ్బంది కొరతతో రోగులు(Patients) ఇబ్బందులు పడుతున్నారని ’విజయక్రాంతి’లో గత నెల 28న ’పేదల వైద్యం.. సర్కారు చోద్యం’ అనే శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక వార్తా కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ(Malaria, Typhoid, Dengue) వంటి సీజనల్ వ్యాధులకు(Seasonal diseases) అవసరమైన మందులు అందుబాటులో ఉన్నా.. పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందించడం సవాలుగా మారుతోంది.
విధుల్లో ఉన్న సిబ్బందే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రోగుల రద్దీ పెరిగిన రోజుల్లో వారికి పనిభారం అధికమవుతోంది. ఇదే విషయాన్ని ’విజయక్రాంతి’ వెలుగులోకి తెచ్చింది. ఫలితంగా ఉన్నతాధికారులు సిద్దిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు (యూహెచ్సీ), వాటి పరిధిలోని బస్తీ దవాఖానాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఖాళీగా ఉన్న స్థానాల్లో వైద్యాధికారులు, నర్సుల నియామకం చేపట్టనున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ధనరాజ్ తెలిపారు. దీంతో పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.