అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రూ.15 కోట్ల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
పటాన్ చెరు/జిన్నారం, మే 15 : పటాన్ చెరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. గురువారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొల్లారం మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువలు, ఇంటింటికి రక్షిత మంచినీరు అందించామని తెలిపారు. భవిష్యత్తులోనూ మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొలను బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులుపాల్గొన్నారు.






