బ్రిటన్ పార్లమెంటు బరిలో తెలంగాణ బిడ్డ
లేబర్ పార్టీ తరఫున ఉదయ్ నాగరాజు పోటీ
ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా శనిగరం
హైదరాబాద్/కరీంనగర్, మే 15 (విజయక్రాంతి): బ్రిటన్ పార్లమెం టు ఎన్నికల్లో ఈసారి ఓ తెలంగాణ బిడ్డ పోటీ పడుతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన నిర్మలాదేవి దంపతుల కుమారుడైన ఉదయ్ నాగరాజు.. బ్రిటన్ లేబర్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ స్థానం అభ్యర్థిగా నాగరాజును లేబర్ పార్టీ ప్రకటించింది. బౌండరీ కమిషన్ సూచనతో నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ కొత్తగా ఏర్పడ్డ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలక్టోరల్ ప్రకారం ఈ నియోజకవర్గంలో లేబర్ పార్టీ గెలుపు అవకాశాలు 68 శాతం ఉన్నాయి.
ప్రస్తుతం బ్రిటన్లోనూ ఎన్నికల హడావిడి మొదలైంది. ఉదయ్ నాగరాజు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వంతో అంచెలంచెలుగా ఎదిగారు. బ్రిటన్లోని యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు. ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ట్యాంక్ను నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచిపేరు సంపాదించారు.
క్షేత్రస్థాయి సమస్యలపై ఉదయ్కు మంచిపట్టు ఉంది. స్కూల్ గవర్నర్గా, వాలంటీర్ విస్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటి ప్రచారంతో సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. దాదాపు అన్ని సర్వే సంస్థలు ఈ ఎన్నికల్లో లేబర్పార్టీ ఆఖండ విజయం సాధిస్తుందని తెలిపాయి. దీంతో ఉదయ్ నాగరాజు కూడా ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.




