calender_icon.png 15 June, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత లోతుగా ఫోన్ ట్యాపింగ్ విచారణ

15-06-2025 12:03:52 AM

  1. ఎస్‌ఐబీ మాజీచీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడి
  2. మూడోసారి సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు 
  3. అక్రమ నిఘా జరగలేదని వాదించినట్టు సమాచారం

హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నింది తుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీచీఫ్ టీ ప్రభాకర్ రావు మూడోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ లోని సిట్ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు మాజీ డీఎస్పీ డీ ప్రణీత్ రావు వెల్లడించిన నేపథ్యంలో, ఈ విచారణ కీలకంగా మారింది.

సిట్ విచారణలో భాగంగా శుక్రవారం మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అధికారులు  ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆధారాలను ధ్వంసం చేసినట్లు ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత, డిసెంబర్ 4, 2023న సిట్ కార్యాలయంలోని 42 హార్డ్‌డిస్క్‌లను ప్రణీత్‌రావు ఎలక్ట్రిక్ కట్టర్‌తో నాశనం చేసి, మూసీనదిలో విసిరేసినట్లు తెలిపారు.

ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రభాకర్‌రావును సిట్ అధికారులు మరింత లోతుగా విచారించినట్టు సమాచారం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 200మంది ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా దుబ్బాక (2020), హుజూరాబాద్ (2021), మునుగోడు (2022) ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలైన ఈటల రాజేందర్, ఎం. రఘునందన్‌రావు, బండి సంజయ్ వంటి వారి ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు సిట్ తేల్చింది.

అలాగే అప్పటి ప్రతిపక్షనేతలైన రేవంత్‌రెడ్డి, వారి కుటుంబసభ్యులు, బీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నేతల ఫోన్‌లను కూడా నిఘా పెట్టినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసు 2024 మార్చిలో వెలుగులోకి రాగానే, ప్రభాకర్‌రావు అమెరికాకు పారిపోయారు. దాదాపు 15నెలల పాటు విదేశాల్లో ఉన్న ఆయన, సుప్రీంకోర్టు మే 29, 2025న అరెస్ట్‌పై తాత్కాలిక ఊరట కల్పించడంతో జూన్ 8న హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఆయన మూడు రోజుల్లో సిట్ ఎదుట హాజరుకావాలని షరతు విధించడంతో, జూన్ 9 నుంచి విచారణకు హాజరవుతున్నారు. ఈ కేసులో ప్రభాకర్‌రావుతో పాటు, అరెస్టయిన ఇతర అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు స్టేట్‌మెం ట్‌లు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని బడా నేతల వైపు సూచిస్తున్నాయి. అయితే, ప్రభాకర్‌రావు తన విచారణలో అన్ని చర్యలు ‘రివ్యూ కమిటీ’ ఆమోదంతోనే జరిగాయని, ఎటువంటి అక్ర మ నిఘా జరగలేదని వాదించినట్టు సమాచారం.

ప్రణీత్‌రావు స్టేట్‌మెంట్‌తో కేసు కొత్త దిశగా సాగుతుండటంతో, సిట్ అధికారులు మరింత లోతైన విచారణకు సిద్ధమవుతున్నారు. ఫోన్ ట్యా పింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎవరికి అందించబడింది.. దాన్ని ఎలా ఉపయోగించారు, ఎవరెవరి ఫోన్‌లు ట్యాప్ చేశారనే వివరాలను సిట్ లోతుగా పరిశీలిస్తోంది. ప్రభాకర్‌రావు విచారణ, ప్రణీత్ రావు వెల్లడించిన కీలక సమాచారం ఈ కేసు ను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.