29-05-2025 01:07:41 AM
-నిత్యం 96 మెట్రిక్ టన్నుల చెత్త 20 ఏండ్లుగా పేరుకుపోయిన చెత్త
-అక్కడే కాల్చి వేస్తుండటంతో పొగతో సతమతం
-నీలగిరి వాసులకు నిత్యం నరకం
నల్లగొండ టౌన్, మే 24 : పట్టణ ప్రజలు వదిలేసిన వ్యర్ధాలకు గ్రామాల ప్రజలు బలవుతున్న తీరు వర్ణనాతీతం. ఆ క్రమంలోనే నల్లగొండ పట్టణంలో సేకరించిన చెత్తను ఆ గ్రామాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ లోకి చేరవేసి నిప్పంటించి కాల్చి వేయడం వల్ల మూడు గ్రామాల ప్రజలు తిప్పలు పడుతున్నారు.కానీ మున్సిపల్ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయం చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
మున్సిపాలిటీలో చెత్త ఇలా...
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో గృహ, వాణిజ్య సంస్థల నుంచి రోజు 96 మెట్రిక్ టన్నుల ఘన పదార్థాలను మున్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తున్నారు.వ్యర్థాలు గత 20 సంవత్సరాల నుంచి సేకరించి పేరుకుపోయిన దాదాపు 1.9 లక్షల మెట్రిక్ టన్నులు యార్డ్ లో ఉంది. నల్లగొండ మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డ్ 2011లో ఏర్పాటు చేశారు.
పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యార్డ్ చందన పల్లి , ఖాజీరామరాం, శేషమ్మ గూడెం గ్రామాలకు అత్యంత సమీపంలో ఉంది. అంతేకాకుండా జిల్లాలోని 132 ఆవాసాలకు నీటి వనరులను అందించే ఉదయ సముద్రం రిజర్వాయర్ కూడా డంపింగ్ యార్డ్ కు అతి సమీపంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
చందనపల్లి , ఖాజీరామరాం,శేషమ్మ గూడెం ఈ మూడు గ్రామాలు నల్లగొండ రూరల్ మండల పరిధిలో ఉంటాయి. ఇక్కడ సుమారు 8000 మంది జనాభా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డ్ లో చెత్త కుప్పలు తరచుగా నిప్పు అంటుకోవడంతో పొగ వల్ల గ్రామాల్లో దుర్గంధం వెదజల్లుతుంది.
దీనివల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిసింది. డంపింగ్ యార్డ్ లోని వ్యర్థాలకు అంటుకుంటున్న మంటలను ఆర్పడానికి మున్సిపల్ అధికారులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో 24 గంటలు మండుతూనే ఉంటుంది.
రోగాల బారిన ప్రజలు...
డంపింగ్ యార్డ్ ను నుంచి వస్తున్న పొగ వల్ల వాతావరణమంతా కాలుష్యం అవుతుంది. దీనివల్ల గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా రావడం వల్ల శ్వాసకు సంబంధించిన సమస్యలు తలచుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.. వాతావరణంలో కలిసిపోతున్న ఈ పొగ ను ప్రజలు పీల్చుకోవడం వల్ల రోగాలు వస్తున్నాయని, ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగితే ఆ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలంతా జీవిత కాలాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తరచూ ప్రమాదాలు...
డంపింగ్ యార్డ్ ఏర్పాటుచేసిన చందన పల్లి ప్రాంతంలో యాక్సిడెంట్ జోన్ గా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో ప్రతిరోజు సాయంత్రం వేళలో డంపింగ్ యార్డ్ పొగ రోడ్డు వెడల్పున వ్యాపించడంతో తరచు ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇటీవల నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి సాయంకాలం సమయంలో నకరేకల్ నుండి నల్గొండకు వస్తుండగా రోడ్డుపై పొగ మంచు కమ్ముకొని ఉండడంతో తన బైకుకు కుక్కలు అడ్డు రావడంతో రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే కాక గతంలో ఈ ప్రాంతంలో చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు.