29-05-2025 01:02:28 AM
హుస్నాబాద్ లో పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇండ్లు
గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీజేపీ ఫైర్
హుస్నాబాద్, మే 29 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనంగా మారిన ఈ సమస్యపై బీజేపీ తీవ్ర స్థాయిలో గర్జించింది.
వెంటనే ఆ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించకపోతే, పెద్ద ఎత్తున ఆందోళనలు, మంత్రి క్యాంపు ఆఫీసు ముట్టడి వంటి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది. ఈమేరకు బుధవారం ఆ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ఆర్ అండ్ బీ డీఈ నరేందర్ కు వినతిపత్రాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం పట్టణ శివారులో 96 మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసి, పట్టాలు కూడా ఇచ్చిందన్నారు. ఆ ఇండ్లను స్లాబ్, గోడలు మాత్రమే వేసి వదిలేశారని, లబ్దిదారులు వాటిలో నివసించడానికి కనీస సౌకర్యాలైన ఫ్లోరింగ్, కిటికీలు, డోర్లు, కరెంట్, ప్లంబింగ్ వంటివి లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూడు సంవత్సరాలు పనులను పట్టించుకున్న నాథుడు లేడని, పేద ప్రజల ఆశలతో ఆడుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్దిదారులు ఎన్నోసార్లు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు, అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
త్వరలో లబ్దిదారులతో కలిసి పెద్దయెత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షుడు గాదాసు రాంప్రసాద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ చారీ, మండల అధ్యక్షుడు ఇటిక్యాల కుమారస్వామి, సీనియర్ నాయకులు వరియోగుల అనంతస్వామి, పెద్ది శ్రీనివాస్, లబ్దిదారులు గడిపె శారద, ఆనంద్, పద్మ, రుక్మవ్వ, సుదీర్, శారద, రాధ, ఎండీ. పాజూ రాదన్, ప్రవీణ్, కళా, రవళి, రోకియా, శ్రీనివాస్ కోమల, కస్తూరి తదితరులు పాల్గొన్నారు.