calender_icon.png 22 December, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పుల కలకలం

22-12-2025 01:56:13 AM

జోహెన్నెస్‌బర్గ్ లోని ఓ బార్ ముందు దుండగుల ఫైరింగ్

నడి రోడ్డుపై నిలుచుని విచక్షణారహితంగా కాల్పులు

తొమ్మిది మంది మృతి.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు

మరో పది మందికి గాయాలు

జోహెన్నెస్‌బర్గ్ డిసెంబర్21: సౌతాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ శివారులోని బెకర్స్ డాల్ టౌన్‌షిప్‌లో ఆదివారం ఉదయం ఓ బార్ ముందు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారు తొమ్మిది మంది చనిపోయారు. మరో పది మందికి గాయాలయ్యా యి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నా రు. అయితే, ఘాతుకానికి గల కారణాలు తెలియరాలేదు.

దుండగులు రెండు కార్లలో అక్కడికి చేరుకుని అకస్మాత్తుగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. తొలుత ఈ ఘటనలో పదిమంది చనిపోయారని ప్రకటించారు. ఆ తర్వాత మృతులు తొమ్మిది మంది అని స్పష్టత ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే దుండగులు పారిపోయారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. 

నెల రోజుల వ్యవధితో రెండో ఘటన

కాల్పులు జరిగిన ఏరియా చుట్టుపక్కల బంగారు గనులు ఉన్నాయని, అక్కడ కార్మికులే ఎక్కువగా ఉంటారని పోలీసులు వివరిం చారు. కాగా, ఈ ఘటన తర్వాత స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమస్యాత్మక ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ నెలలో దక్షిణాఫ్రికాలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన. ఈ నెల 6న ప్రిటోరియా సమీపంలో జరిగిన కాల్పుల్లో మూడేళ్ల చిన్నారితో సహా 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.