13-06-2025 01:24:35 AM
మల్లేపల్లి ఏకలవ్య :
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : ప్రైవేట్ స్కూలు టీచర్ల జీవితాలు దినదినగండంగా మారా యి. వారి ఉద్యోగాలు ఎప్పుడుంటాయో.. ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితి. శ్రమ ఎక్కువ.. జీతా లు తక్కువ. అరకొర జీతాలతో వారి బతుకు మరిం త దారుణంగా తయారైంది. పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లలో మినహా ప్రైవేట్ స్కూళ్లలో సరిగ్గా ఐదంకెల జీతాలు తీసుకునే వారు అతితక్కువ మందే ఉం టారంటే అతిశయోక్తి కాదు.
తక్కువ జీతాలకే వేలాదిమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసేవారికి వేధింపులూ ఎక్కువే. పైగా అదనపు పనిభారం తప్పదు. సెలవులు సరిగా ఉండవు. ఆదివారాలు, వేసవి సెలవుల్లోనూ ఉపాధ్యాయులతో పనిచేయించుకుంటున్నారు. స్కూల్ టీచర్లనే సేల్స్ స్టాఫ్గా మార్చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలో ఏకంగా ఉపాధ్యాయులకే బ్రౌచర్లు ఇచ్చి ఇంటింటికీ కేన్వాసింగ్ చేయిస్తున్నారు.
వారి ఉద్యోగానికి భరోసా, భద్రత లేకుండా పోతోంది. మేడ్చల్లోని ఓ పాఠశాల యాజమాన్యం ఎలాంటి నోటీసులివ్వకుండా ఏకంగా 20 మంది ఉపాధ్యాయులను తొలగించింది. రాష్ట్రంలో ఇలా ఏకపక్షంగా ఉద్యోగాల నుంచి తొలగించడం సర్వసాధారణమైంది. ఉద్యోగులను ఏకపక్షంగా తొలగించే విధానం ఎక్కువగా సాఫ్ట్ వేర్ తరహా రంగాల్లో చూశాము. కానీ ఇటీవల ఈ విధానం విద్యావ్యవస్థలోనూ ఎక్కువవుతోంది.
అలాగే ఏఎస్ రావు నగర్లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ కే మురళి (ఆయన అభ్యర్థన మేరకు పేరు మార్చబడింది)ని మరుసటి రోజు నుంచి విధుల్లోకి రా వొద్దని యాజమాన్యం ఆదేశించింది. పైగా ఆయనకు ఎటువంటి కారణం చెప్పలేదు. అలాగే జూబ్లీహిల్స్లోని మరో పేరున్న పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఆ పాఠ శాల కార్యదర్శికి నచ్చలేదని తొలగించింది. ఈ నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలో హైదరాబాద్ నగరంలోని అనేక ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి ఇలానే ఉంది.
అతితక్కువగా జీతాలు..
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను తొలగించ కుండా నిరోధించే స్పష్టమైన నియమాలుగానీ లేదా మార్గదర్శకాలుగానీ లేవని యు నైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు చావా రవి చెప్పారు. అయితే ప్రైవేట్ పాఠశాలల చట్టం (1/1982) ప్రకా రం ప్రైవేట్ పాఠశాలలకు కొన్ని నిబంధనలున్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడంలే దన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయు లు, సిబ్బంది నియామకం పూర్తిగా ఆయా పాఠశాల యాజమాన్యాల అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల ఉపా ధ్యాయులు కార్మిక చట్టం లేదా వారికి రక్షణ కల్పించే మరే ఇతర చట్టం కిందకు రారని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే వారికి అన్యాయం జరుగుతున్నదన్నారు.
చాలావరకు ప్రైవేట్ పాఠశాలలు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపైనే ఆసక్తి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో అవి శ్రద్ధ చూపడంలేదు. విద్యను వ్యాపారం చేసి, లాభాలే ధ్యేయంగా అరకొర జీతాలిచ్చి ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. నెలకు రూ.6,000 వరకు వేతనాలిచ్చి ఉపాధ్యాయులను నియమిస్తున్నాయి. మరోవైపు అర్హత లేని ఉపాధ్యాయులను నియమిస్తూ విద్య నాణ్యతను కూడా దెబ్బతీస్తున్నాయని చావా రవి పేర్కొన్నారు.
కనీసం ఉద్యోగంలో మూడేళ్లుండాలి..
ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు తొలగించకుండా ప్రైవేట్ పాఠశాలలకు మార్గదర్శకాలను జారీ చేయాలని పలువురు విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉపాధ్యాయులను కనీసం మూడు సంవత్సరాల పాటు ఉద్యోగాల్లో ఉండేలా నిబంధనలు రూపొందించాలంటున్నారు. వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా కాకుండా, మెరిట్ ఆధారంగా నియామకం జరగాలని చెప్తున్నారు.
పాఠశాలల యాజమాన్యాలు సైతం ఉపాధ్యాయుల పట్ల హుందాగా, మానవీయ కోణంలో నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ‘నేను’.. ‘నా’ అని కాకుండా ‘మనం’.. ‘మన’కు మారడం ద్వారా మంచి ఫలితాలను సాధించే అవకాశముంది. ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు పరస్పర సహకారంతో నడుచుకుంటేనే ప్రైవేట్ విద్య మరింత అభివృద్ధి చెందుతుంది.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..
అంతేకాకుండా ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. వారి సమస్యలు చెప్పుకునేందుకు ఒక ప్రత్యేక సెల్ను సైతం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇష్టానుసారంగా, అకారణంగా ఉపాధ్యాయులను తొలగించకుండా ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించేందుకు కఠినమైన నియమాలను అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. లేకుంటే అటు విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందక పోవడంతో పాటు, ఉపాధ్యాయుల గౌరవానికీ భంగమే.
అమానవీయంగా తొలగింపులు..
తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకట స్వామి మాట్లాడుతూ, చిన్న చిన్న కారణాలకే ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలిగిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదులు లేదా విద్యార్థుల్లో ఇంప్రూ వ్మెంట్ సరిగా లేదనే కారణాలను సాకుగా చూపి ఉపాధ్యాయులను అమానవీయంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఏకపక్షంగా తొలగించడాన్ని ఆయన వ్యతిరేకించారు.
ఇంకా కొన్ని పాఠశాలల్లో ఆయా యాజమాన్యాలకు, వారికి సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులకు నచ్చకున్నా ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి. కరోనా (కొవిడ్) సమయంలోనే కాదు.. ఆ తర్వాత కూడా ఈ పరిస్థితి మరిం త దిగజారింది. అయితే ప్రైవేట్ ఉపాధ్యాయల హక్కుల కోసం పోరాడేందుకు బలమై న ఉపాధ్యాయ సంఘాలు, నాయకత్వం లేకపోవడంతో వీరంతా గడ్డు పరిస్థితిని ఎదు ర్కొంటున్నారు.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు మద్దుతిచ్చేవారు లేకపోవడమూ ఇందుకు కారణమే. తెలంగాణ ఉద్యమ సమయంలో (2014 ముందు), ఉపాధ్యాయ సంఘాలు బలంగా ఉండేవి. ఉపాధ్యాయులకు జరిగే అన్యాయాలపై సంఘాల నుంచే కాకుండా ఇతర వర్గాల నుంచి కూడా మద్దతు లభించేది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సంబంధాలు సరిగా ఉండకపోవడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, గ్రూపు రాజకీయాలతోపాటు నిరాధారమైన ఆరోపణల కారణంగానూ ఉపాధ్యాయులను తొలగిస్తున్నారని ఆయన చెప్పారు.
జాబ్ పోర్టల్ ఏర్పాటు..
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) అధ్యక్షుడు ఎన్. మధుసూదన్ మాట్లాడుతూ, ప్రైవేట్ టీచర్ల ఉద్యోగ భద్రతకు ప్రైవేట్ టీచర్ల కోసం ఒక జాబ్ పోర్టల్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వారికి సులువుగా మళ్లీ ఉద్యోగాలు దొరికేలా దాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 11,757 ప్రైవేట్ పాఠశాలలున్నాయి, వాటిలో 2 లక్షలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, కానీ ఈ వీరంతా ఉద్యోగ భద్రత, భరోసా లేని జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు.
మెరిట్ ఆధారంగా..
ఉపాధ్యాయులను ఉద్యోగంలో తీసుకునేటప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా కాకుండా మెరిట్ ఆధా రంగా నియామకాలు చేపట్టాలని వి ద్యానిపుణులు సూచిస్తున్నారు. కనీసం మూడేళ్లు ఉద్యోగంలో ఉండేలా నియామకాలు జరపాలి.
తెలంగాణ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కత్తి వెంకట స్వామి