calender_icon.png 26 June, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిరోజు సందడిగా పాఠశాలలు!

13-06-2025 01:23:25 AM

  1. 54 లక్షల పాఠ్య పుస్తకాలు, 20 లక్షల యూనిఫాంల పంపిణీ

విద్యార్థులకు పూలతో స్వాగతం పలికిన టీచర్లు

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): వేసవి సెలవుల అనంతరం తొలిరోజు పాఠశాలలు సందడిగా మారాయి. గురువారం విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలతో స్వాగతం పలికారు. పాఠశాలలు తెరిచిన రోజే పుస్తకాలు, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలు తెరిచే నాటికే రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 27,852  ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలకు 1,01,66,220 పుస్తకాలు చేరాయి.

ఇందులో తొలిరోజు పాఠశాలలకు హాజరైన సుమారు 8,33,398 మంది విద్యార్థులకు 54,52, 708 పుస్తకాలను ఉపాధ్యాయులు అందజేశారు. ఈ ఏడాది మొత్తం 20,30,667 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి రోజు పాఠశాలలకు హాజరైన 8,33,398 విద్యార్థులకు ఒక జత యూనిఫాంలను ఉపాధ్యాయులు అందజేశారు.

రెండో జతను సాధ్యమైనంత త్వరలోనే అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచి పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)ను ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తుండటంతో ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేయనున్నారు.

గతేడాదే సమారు 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం, 21,419 మందికి ప్రమోషన్లు ఇవ్వడం, 34,700 మందికి బదిలీలు పూర్తి చేయడంతో ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల నమోదు, బోధనపై నూతనోత్సాహంతో దృష్టిసారించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల నేతృత్వంలోనే గతేడాదే అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం పూర్తి చేసింది.  పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ ఇతర కార్యకలాపాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు రోజువారీ సమీక్ష చేస్తున్నారు.