08-06-2025 12:00:00 AM
అవకాశాలకోసం పారితోషికం తగ్గించుకుంటున్న హీరోయిన్లు
ఏ రంగంలో ఎదగాలనుకున్నవారైనా వెనక్కి తగ్గే సూత్రాన్ని పాటించక తప్పదు. ఇందుకు చిత్రపరిశ్రమలో ఉన్న తాము కూడా అతీతం కాదనుకున్నారో ఏమో.. కొందరు అందాల భామలు. పారితోషికం విషయంలో రూటు మార్చారు. నేమ్, ఫేమ్ వస్తున్నా కొద్దీ రెమ్యునరేషన్ పెంచుతూ వచ్చిన కథానాయికలు.. ఆ విషయంలో ఇప్పుడు పట్టువిడుపుగా వ్యవహరిస్తున్నారట. ఎందుకలా అంటారా..? ఇంకెందుకూ? అవకాశాలు కోసమే!
జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తాము నడిచొచ్చిన తోవను మర్చిపోతే ముందుకు సాగేందుకు దారి దొరకదంతే! ఒక్కోసారి ఓ మెట్టు దిగకపోతే పైకి ఎగబాకడం కష్టతరమవుతుంది. ఒక్క ఉదుటున దూకి తన లక్ష్యాన్ని అందుకునే క్రమంలో సింహం కూడా ఓ అడుగు వెనక్కి వేస్తుంది. పట్టు విడుపులుంటేనే కదా జీవన నావ సాఫీగా ముందుకు సాగేదీ?! జీవితంలో ముందుకెళ్లాలంటే అవసరమైనచోట కొంచెం వెనక్కి తగ్గాల్సిందే.
ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ చేసేది కథానాయికే.. కథను ముందుకు నడిపించడంలో హీరోయిన్ పాత్ర ఎక్కువగా సహాయపడుతుంది. అంతేకాదు ఆమె నటన సినిమాకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఒక సినిమా సక్సెస్ కావడానికి నాయకా నాయికలిద్దరూ సమానంగా పనిచేయాలి. అప్పుడే సన్నివేశాలు రక్తి కడతాయి. అలా ఒక పాత్ర ద్వారా సినిమాతో ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇలాంటి ప్రేక్షకుడి నాడిని పట్టుకోవడం టాలీవుడ్ మేకర్స్కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తెలుగు సినిమాల్లో కథానాయిక పాత్ర చాలా ముఖ్యమని భావిస్తారు. హీరోయిన్ పాత్ర కథను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర ద్వారా కథలో కొత్త మలుపులు వస్తాయి. ప్రేక్షకులు కథను మరింతగా ఆసక్తితో చూస్తారు. కథానాయకి నటన సినిమాకు ఒక ప్రత్యేకతనిస్తుంది.
ఆమె నటన ద్వారా ప్రేక్షకులు సినిమాలోని భావాలను మరింతగా అనుభవిస్తారు. సినిమాతో కనెక్ట్ అవుతారు. హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ సినిమా సక్సెస్కు చాలా ముఖ్యం. ఇద్దరూ బాగా కలిసి నటించడం ద్వారా సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది.
కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్ర హీరోకు సమానంగా ఉంటుంది. మరికొన్నింటిలో ఆమె పాత్ర కథానాయకుడికి సహాయకారిగా మాత్రమే ఉంటుంది. హీరోయిన్ నటన, సినిమాలో ఆమె పాత్ర చాలా ముఖ్యం. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు గతంలో కొంతవరకు పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పుడు కథానాయికల పాత్రలు మరింతగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
లైమ్లైట్లోకి వచ్చేందుకు కొత్త స్ట్రాటజీ
సినీ ఇండస్ట్రీని శాసించేది ‘సక్సెస్’ మాత్రమే. ఏ హీరోయిన్ నటించిన సినిమా హిట్ కొడుతుందో.. తర్వాతి చిత్రంలోనూ అదే భామనే కథానాయకిగా తీసుకోవడం సాధారణమైపోయింది. అది సెంటిమెంటో లేక.. ఫ్యాన్స్ టేస్ట్కు తగ్గట్లుగా హీరోయిన్స్ను సెలెక్ట్ చేస్తున్నారో, మార్కెట్ను క్యాష్ చేసుకుంటున్నారో తెలియదు కానీ.. ఇదో ట్రెండ్ అయిపోయిందిప్పుడు. ఒక హిట్ కొడితే చాలు ఆ హీరోయిన్ను వరుసగా మూడు, నాలుగు సినిమాల్లో తీసుకుంటున్నారు.
దీంతో పలువురు కథానాయికలు సినిమా అవకాశాలు లేక ఫీల్ అవుతున్నారట. ఛాన్స్ కోసం రెమ్యునరేషన్ను తగ్గించుకునేందుకు కూడా వెనకాడటం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల మధ్య గట్టి పోటీయే నెలకొంది. ముఖ్యంగా హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషల నుంచి వచ్చిన భామలు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ను షేక్ చేస్తున్నారు.
వరుస సినిమాలు లేక, మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కొందరు ముద్దుగుమ్మలకు ఎదురుచూపులే మిగులుతున్నాయట. అందుకే కొందరు బ్యూటీలు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. అవకాశాల కోసం డైరెక్టర్లకు, నిర్మాతలకు ఫోన్లు చేసి, మాకు ఛాన్స్ ఇవ్వండి, రెమ్యునరేషన్ మీ ఇష్టం అంటూ బతిమాలుకుంటున్నారట.
ఇంకా షాక్కు గురిచేసే విషయం ఏంటంటే.. స్టార్ హీరోయిన్స్ రేట్స్ తెలుసుకుని, అందులో సగానికి సగం రెమ్యునరేషన్కే సినిమా చేసేందుకు ఓకే చెప్తున్నారని సమాచారం. టాప్ హీరోయిన్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్లకు పైగా తీసుకుంటుంటే, కొందరు కొత్త హీరోయిన్స్ లేదా అవకాశాలు తగ్గినవారు రూ.50 లక్షలు లేదా అంతకంటే తక్కువైనా సైన్ చేస్తున్నారట.
ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్నవారు, వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఈ ప్లాన్తో మళ్లీ లైమ్లైట్లోకి రావాలని చూస్తున్నారనేది ప్రస్తుతం చిత్రపరిశ్రమలో వినవస్తున్న హాట్ టాపిక్.