11-08-2025 10:25:28 PM
2017లో ఆర్టీఐ కార్యకర్త వాకిటి మధు బాబును చంపించేందుకు కార్పొరేటర్, కాంగ్రెస్ లీడర్,ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేత రౌడీ షీటర్ తో సుఫారీ..
2017 లో జగద్గిరిగుట్ట బస్ స్టాప్ లో ఆర్టీఐ కార్యకర్త పై సదరు రౌడీ షీటర్ మర్డర్ కు యత్నం..
నేడు అప్రూవర్ గా మారిన రౌడీ షీటర్..
వారి నుండి నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది..
గవర్నర్ కు ఫిర్యాదు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): 2017లో ఆర్టీఐ కార్యకర్త వాకిటి మధు బాబుపై జరిగిన హత్యా దాడి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency)లో అప్పట్లో పలు విమర్శలకు దారితీసింది. ప్రైవేట్ స్కూల్స్ అక్రమ అనుమతులు, ఇల్లీగల్ గా నడుస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలలపై ఆర్టీఐ కార్యకర్త మధు బాబు గతంలో పలు పిటిషన్ లు వేశారు. అయితే 2017లో ఆర్టీఐ కార్యకర్తను చంపించేందుకు స్థానిక రౌడీ షీటర్ బాలరాజుకు సుఫారి కుదిర్చారు.
బస్టాప్ లో ఓ జిరాక్స్ సెంటర్ లో పేపర్స్ జిరాక్స్ తీస్తుండగా ఆర్టీఐ కార్యకర్త మధు బాబుపై రౌడీ షీటర్ బాలరాజు విచక్షణ రహితంగా కత్తితో పొడిచి పారిపోయాడు. స్థానికులు, పోలీసుల సహాయంతో తీవ్రంగా గాయపడిన ఆర్టీఐ కార్యకర్త మధు బాబును హాస్పిటల్ కు తీసుకువెళ్లి వైద్యం అందించడంతో ప్రాణాల నుండి బయటపడ్డాడు. పలు పత్రికలలో మీడియాలో ప్రధాన వార్తగా ప్రచురించడంతో పోలీసులు సీరియస్ గా తీసుకొని నిందితుడు బాలరాజు నాయుడుపై అట్టెంప్ట్ మర్డర్ కేసుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు గా బాలరాజు ఉన్నాడు.
గవర్నర్ కు నిందితుడు ఫిర్యాదు..
అట్టెంప్ట్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బాలరాజు సోమవారం రాష్ట్ర గవర్నర్ సెక్రటరీ కీ ఫిర్యాదు చేసి మర్డర్ చేయాలని నన్ను ప్రోత్సహించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని, వారి నుండి నాకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని గవర్నర్ కార్యాలయంకు అందించిన ఫిర్యాదులో తెలిపాడు. బాలరాజు ఆరోపణలు, ఫిర్యాదు చేసిన వారిలో గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ రషీద్ పేర్లు ఉండడం స్థానికంగా చర్చనీయంశం అయింది.