24 August, 2026 | 2:56 AM

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

24-08-2026 02:26 AM

సింగరేణి వ్యాప్తంగా పనిముట్ల అందించడంలో యాజమాన్యం విఫలం

పెరిక్స్ పై ఇన్‌కమ్ టాక్స్ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 23 (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఈనెల 27 వరకు కార్మికులకు ఇచ్చిన  హామీలను అమలు చేయకుంటే అన్ని జాతీయ  కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేయడం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.

ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. కార్మికులకు పనిముట్ల ఏర్పాటు చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు.

సింగరేణి యాజమాన్యం యుద్ధం వల్లనే పనిముట్ల కొరత టెండర్లు నిలిచిపోవడం వల్లనే పనిముట్లు అందడం లేదని కారణం చెబుతుంది అన్నారు.అరిగిపోయిన పనిముట్లతో పనులు చేయలేక కార్మికుల శరీరంపై భారం పతూ కార్మికులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అండర్ గ్రౌండ్ లో గాలి అందడం లేదని దానివల్ల భూపాలపల్లి ఏరియాలోని కేటీకే వన్ ఇంక్ లైన్ లో గోపి అనే కార్మికుడు మరణించాడన్నారు. పెరుక్స్ పై ఇన్కమ్ టాక్స్ విషయంలో తప్పకుండా అమలు చేయాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేయడం జరిగిందన్నారు.

దీన్ని సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్న కానీ 65 కోట్ల భారం పడుతుందని, ప్రభుత్వం అనుమతి కావాలని కోరడం జరిగిందన్నారు. సింగరేణిలో రాజకీయ కారణం వల్లనే ఇలాంటి ఒప్పందాలు అమలు కావడం లేదని చెప్పారు. మైన్స్ లో సాధారణ మరణాలు ఎక్కువవుతున్నాయని, ఇటీవల కేటీకే భూపాలపల్లి వన్ ఇంక్ లైన్ లో గోపి అనే కార్మికుడు సాధారణ మరణంగానే పరిగణించడం జరిగిందన్నారు. ఏఐటీయూసీ పోరాట ఫలితం వల్లనే ప్రమాదంలో మరణించిన కార్మికునికి కోటి రూపాయలు బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్ అమలయిందని గుర్తు చేశారు.

పెరిక్స్ పై ఇన్ కమ్ టాక్స్ విషయంలో ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి, ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పెరుక్స్ పై ఇన్కమ్ టాక్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్,అసిస్టెంట్ బ్రాంచి సెక్రెటరీలు జి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, ఎండి ఆసిఫ్ పాషా,బ్రాంచి నాయకులు నూ కల చెంద్రమౌలి, తాళ్ళ పాశం,నాయకులు కృష్ణ మూర్తి, గణేశ్, హైమద్,వంశీకృష్ణ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.